Wednesday, January 15, 2020

హైందవ ధర్మం




హైందవ ధర్మము _పండుగలు

                              డా.బల్లూరి ఉమాదేవి



ఆ.వె:రక్ష చేయు చుండ రక్షించు మనలను

       ధర్మ మెపుడు కూడ ధరణి యందు

       ననుచు చాటి చెప్పె నాగమములు గాన

         నాచరించ వలయు ననవరతము.  : 1 :


ఆ.వె:ధర్మ భూమి మనది కర్మ భూమియు నిదే

         మునులు తపము చేసి ముక్తి గనిరి

       యవతరించిరిచట యమరవరులు కూడ

          శిష్టజనుల కావ శీఘ్రముగను.  : 2  :


3.ఆ.వె:హింస నణచు వాడె హిందువగు నటంచు 

      పలికి రార్యు లపుడె వాసిగాను

      నాత్మ తత్వ  మెరిగి  నదియె బ్రహ్మమనుచు

      మసలు కొనెడి వాడె మాన్యు డగును.


4.ఆ.వె:సర్వ మానవులను సరియైన దారిలో

           నుంచ నవని యందు నొప్పుగాను

           దివిజు లవతరించి తెలుపుటయే గాక

         నాచరించి చూపి రవని యందు.


5 ఆ.వె:వత్సరాది మొదలు పర్వము లెన్నియో 

         భరత దేశమందు వాసి గాను

       నాచరించుచుందు రానందభరితులై

         సంబరమ్ము తోడ సకల జనులు.


6.ఉ.మా:


వచ్చెయు గాదిపండుగిట వాసిగ చైత్రము నందు నా మనిన్

తెచ్చును హర్షమున్ విడక,తీయగ పాడుచు కోయిలమ్మ తా

ముచ్చట లాడుచున్జనులుమోదము తోడను వేప పచ్చడిన్

మెచ్చుచు నారగిం తురిట మిక్కిలి సంబర పాటుతో నిలన్.

7.ఉ.మా:


రాముడు ద్రుంచగా ధనువు రాగము తోడను పెండ్లియాడె నా

కోమలి యల్లనెచ్చెలులు కూరిమి చూపుచు మెచ్చు చుండగా

శ్యామలవర్ణునిన్ గనుచు సంబర పాటది హెచ్చగా మదిన్

సోమనిభాస్య తానడచె సుందర రూపుని వెంట సీతయున్ 


8.ఉ.మా

.గ్రక్కున నీవెనన్నిపుడు కావుము వేగమటంచు వేడగా

మక్కువ తోడనిచ్చితివి మానుగ కోకలు పార్థు పత్నికిన్

నక్కర పూని పిల్వకరి కాపద బాపిన శౌరినీకునే

మ్రొక్కెద జూపుమయ్య దయ ముందుగ  నాకిట వేడు చుంటినే.


9ఉ.మా:


గజముఖదైవమంచు నిను గాఢపు భక్తిని పూని వేడితిన్

విజయమొసంగుమంచు నిల వేడెదనయ్య గణాధిపా సదా

సుజనుల తోడ స్నేహమును సొంపుగ కూర్చుచు మోదమిచ్చుచున్

కుజనుల తోడి పొందునిట కూల్చుచు వేగముగాను బ్రోవరా


10.మానిని

ఉల్లము నందున నొప్పుగ గొల్చెద నొద్దిక గానిట యో హరుఁడా 

మెల్లగ  దీర్చుము మేనున తాపము మెం డయె శంకర మేరువునే 

 విల్లుగఁ దాల్చిన భీషణ యార్తిని వేగమె బాపుము వేడుకతోఁ

జల్లగ నివ్వుము చక్కని దీవెన జాగును జేయక సాంబశివా.

No comments:

Post a Comment