Saturday, September 30, 2017

విజయదశమి - దుర్గామాత.



అందరికీ విజయదశమి శుభాకాంక్షలు.

"శమీ శమయితే పాపం శమీ శతృ వినాశనీ అర్జునస్య ధనుర్ధారీ రామస్య ప్రియదర్శనీ'''

అంశం: దుర్గామాత.

ఆ.వె:అసుర వరుని జంప నాదిశక్తిగ బుట్టె

       ఆగ్రహాన తాను నవని యందు

       అష్టమి దినమందు దుష్టుల దునుముచు

       దర్గ యయ్యె తాను దురము నందు.

ఆ.వె:ముగురు మూర్తు లలకె మూలపుటమ్మయ్యె

        నాయుధముల నెల్ల నమరు లొసగ

        సంహరించె మహిషు శక్తిని చూపుచు

        విజయ దుర్గ యనగ వెలసె భువిని.

కం:అమ్మా శాంభవి దుర్గా

కొమ్మా వందన శతములు కూరిమి తోడన్

నమ్మితిమమ్మా సతతము

మమ్మెన్నడు విడక బ్రోచి మంగళ మిమ్మా.

కం:నెమ్మోమున కరుణజి లుక
   కమ్ముఖమున రౌద్రరసము నల్లల్లాడన్
  జిమ్మి కనక దుర్గమ్మగ
  నమ్మా బైలెల్లినాది యసురుల దునుమన్.

కం:సురలను గాచుట కొఱకై
    నరవీరభయంకరమగు నాయుధమును తా
    క రమున ఝళిపించుచు  లయ
    కరిమహిషాసురుని జంపి కాచెన్ జగతిన్.

కం:వరము బలముచే మహిషా

     సురుండు విక్రమము జూపి చుల్లలు వెట్టన్

     సురలను గాచుటకై శం

        కరి సింహము నెక్కి దైత్యగణముం జంపెన్.

కం:సురలను కావగ యా య

    సురులను జంపగ దలచుచు సుముఖత జూపన్

    కరిముఖుని తల్లి యాశం

    కరి సింహము నెక్కి దైత్యగణముం జంపెన్.

కం:కరుణామయి యా శివశం

    కరియసురుల పాలిటి భయకరియై తోచన్

 :సురలను కావగ యాశుభ

   కరిసింహము నెక్కి దైత్యగణముం జంపెన్

ఆ.వె:సకల జనుల కాచు శక్తి మాతవు నీవు

       భక్తి తోడ గొలుతు భాగ్య మొసగు

        నిన్ను నమ్మి యున్న నీడేరు కోర్కెలు

        విజయ మొసగుమమ్మ విజయ దుర్గ.

ఆ.వె:పాడ్యమి తిథి నుండి పరమేశు రాణిని
       ప్రస్తుతించి కొల్చి భక్తి తోడ
     విజయదశమి నాడు విజయంబు గోరుచు
     జమ్మి చెట్టు కొలువ జయము లొదవు.

కం:పది దుర్గుణములు వీడుచు

     పదిలముగాధైవమందు భక్తి నిలలో

     సదమల మతితో సతతము

       వదలక చేయమని దెలుపు పర్వంబిదియే.

Thursday, September 28, 2017

నవదుర్గలు&దసరా పద్యములు.

నవదుర్గలు&దసరా పద్యములు.

మిత్రులందరికీ శరన్నవరాత్రి శుభాకాంక్షలు


నవదుర్గలు:ఆదిపరాశక్తిగా పూజలందుకొనేదేవి త్రిమూర్తుల అంశతో వారి పత్నులైన సరస్వతి,లక్ష్మి,పార్వతు ల నుండి రెండు అంశలతో నవదుర్గగా ఆవిర్భవించిందని పురాణాల ద్వారా తెలుస్తుంది.

   ఈదేవిని గురించిన శ్లోకం

:నవరాత్రి సమారాధ్యాం నవచక్ర నివాసినీం
నవరూప ధరాం శక్తిం, నవదుర్గాముపాశ్రయే


శరన్నవరాత్రులో అమ్మవారు ఒక్కొక్క రోజు ఒక్కొక్క పేరుతో ఒక్కొక్క అలంకారముతో భక్తులకు దర్శన మిస్తుంటారు.

          దేవీకవచంలోనూ,వరాహపురాణంలోను అమ్మవారు ఏరోజు ఎలా వుంటారో ఈశ్లోకంద్వారా వివరించబడింది.

“ప్రథమం శైలపుత్రీ చ ద్వితీయం బ్రహ్మచారిణీ |
తృతీయం చంద్రఘంటేతి కూష్మాండేతి చతుర్థకమ్ ||

పంచమం స్కందమాతేతి షష్ఠం కాత్యాయనీతి చ |
సప్తమం కాలరాత్రీతి మహాగౌరీతి చాష్టమమ్ ||

నవమం సిద్ధిదాత్రీ చ నవదుర్గాః ప్రకీర్తితాః |
ఉక్తాన్యేతాని నామాని బ్రహ్మణైవ మహాత్మనా ||”


మెదటి రోజు శైలపుత్రిగా దర్శనమిస్తుంది.

శైలపుత్రీ
సతీదేవి దక్షయజ్ఞంలో తనువును వీడి మరల పర్వతరాజైన హిమవంతుని యింట పుత్రికయై జన్మించి నందున ఆమెకు శైలపుత్రి అనే పేరు స్థిరమైంది. వృషభవాహనారూఢయైన దేవికి కుడిచేతిలో త్రిశూలము, ఎడమచేతిలో కమలము వుంటుంది.తలపై చంద్రవంకను ధరించి వుంటుంది పార్వతి, హైమవతి ,గిరిజ,అనునవియు ఆమె పేర్లే.



ఆ.వె: దక్ష సుతవు నీవు దాక్షాయణీ దేవి

      దగ్ధమైతి వపుడు దక్షునింట

        హైమవతిగ పుట్టి హరుని సేవించుచు

       శంకరు సతి వైతి శైల పుత్రి.


రెండవరోజు అమ్మవారు బ్రహ్మచారిణి పేరుతో పిలువ బడుతూ పూజలందుకొంటుంది.


బ్రహ్మచారిణి' యనగా తపమాచరించు తల్లి. బ్రహ్మమునందు చరించునది.కుడి చేతియందు జపమాలను, ఎడమచేతియందు కమండలువును ధరించి వుంటుంది పరమేశ్వరుని పతిగా పొందుటకు తీవ్రమైన తపస్సు చేసి ఉమ యని ప్రసిద్ధి వహించెను. ఈ దేవి స్వరూపము జ్యోతిర్మయము. భక్తులకును, సిద్ధులకును అనంత ఫలప్రదము. బ్రహ్మచారిణీ దేవి కృపవలన ఉపాసకులకు నిశ్చలమగు దీక్ష, సర్వత్ర సిద్ధి, విజయము ప్రాప్తించును.

.ఆ.వె: బ్రహ్మచారిణిగనె ప్రఖ్యాతి గాంచిన

          మేన తనయ వమ్మ  మేలు కూర్చు

         ఘోర తపము చేసి గోరితివి భవుని

         పతియు నయ్యె తాను పరమ శివుడు.


మూడవరోజు:

దేవి తన శిరమున దాల్చిన అర్ధచంద్రుడు ఘంటాకృతిలో ఉండుటచే ఈమెకు 'చంద్రఘంట' యను పేరు స్థిరపడెను. ఈమె శరీరము బంగారు కాంతి మయము. ఈమె తన పది చేతులలో ఖడ్గము మొదలగు శస్త్రములను, బాణము మున్నగు అస్త్రములను ధరించియుండును. ఈమె సింహ వాహన. ఈమె సర్వదా సన్నాహయై యుద్ధముద్రలోనుండును. ఈమె గంటనుండి వెలువడు భయంకరధ్వనులను విన్నంతనే క్రూరులై దైత్య దానవ రాక్షసులు ఎల్లప్పుడు వడగడలాడుచుందురు. కాని భక్తులకును, ఉపాసకులకును ఈమె మిక్కిలి సౌమ్యముగను, ప్రశాంతముగను కన్పట్టుచుండును.

ఈ దేవి ఆరాధన సద్యఃఫలదాయకము. భక్తుల కష్టములను ఈమె అతి శీఘ్రముగా నివారించుచుండును. ఈ సింహవాహనను ఉపాసించువారు సింహ సదృశులై పరాక్రమశాలురుగా నిర్భయులుగా ఉందురు. ఏవిధమైన భయములును వారిని బాధింపజాలవు.

ఆ.వె:భక్త జనుల యొక్క పాపాల రాశిని

         తొలగ జేయు నట్టి దుర్గ వీవు

          చంద్ర ఘంట యనుచు చక్కగా కొలిచేము

         కావు మమ్మ మమ్ము కరుణ తోడ.

నాలుగవరోజు అమ్మవారు “కూష్మాండ”అను పేరుతో అర్చింపబడుతుంది.

అవలీలగా బ్రహ్మాండమును సృజించునది గావున ఈ దేవి 'కూష్మాండ' అను పేరుతో విఖ్యాత యయ్యెను. ఈమె సూర్య మండలాంతర్వర్తిని. సాటిలేని ఈమె తేజస్సు నిరుపమానము. ఈమె యొక్క తేజోమండల దశదిశలు వెలుగొందుచున్నవి. బ్రహ్మాండము లోని సకల వస్తువులలో, ప్రాణులలో గల తేజస్సు ఈమె ఛాయయే.

'అష్టభుజాదేవి' అని కూడా పిలువబడే ఈమె ఎనిమిది భుజములతో విరాజిల్లిచుండును. ఏడు చేతులలో వరుసగా కమండలువు, ధనుస్సు, బాణము, కమలము, అమృతకలశము, చక్రము, గద - అనునవి తేజరిల్లుచుండును. ఎనిమిదవ చేతితో సర్వసిద్ధులను, నిధులను ప్రసాదించు జపమాల యుండును. ఈమెయు సింహవాహనయే.

భక్తులు ఈ దేవిని చక్కగా ఉపాసించుటచే పరితృప్తయై ఈమె వారి రోగములను, శోకములను రూపుమాపును. ఈమె భక్తులకు ఆయుర్యశోబలములు, ఆరోగ్యభాగ్యములు వృద్ధిచెందును. కొద్దిపాటి భక్తిసేవలకును ఈదేవి ప్రసన్నురాలగును.

ఆ.వె:అంబ పూజ చేయ హర్షించి దీవించు

       భక్తి తోడ గొలువ వరము లొసగు

      కూరిమెంతొ చూపు కూష్మాండ గౌరియై

         సర్వ సిద్ధు లొసగు శైల పుత్రి.


నవరాత్రులలో ఐదవ రోజు.

"స్కందమాత"

 కార్తికేయుడు,షణ్ముఖుడు,శక్తిధరుడు,గుహుడు అను పేర్లతో ప్రసిద్ధుడైన స్కందుని తల్లి పార్వతీదేవిని స్కందమాత పేరుతో నవరాత్రులలో ఒకరోజు ఆరాధిస్తారు .

సింహవాసినియైన ఈ దేవి చతుర్భుజాలతో దర్శన మిస్తుంది.కుడివైపు ఒకచేత స్కందుని పట్టుకోగా మరో చేతిలోపద్మముంటుంది.ఎడమ వైపు ఒకచేత అభయ ముద్ర మరొక చేత కమలము ధరించి వుంటుంది.స్కందమాతను ఉపాసించుట వలన భక్తుల కోరికలు నెరవేరుతాయి.


ఆ.వె:స్కందమాత వీవు శంకర పత్నివి

         భక్తి తోడ కొలుతు భాగ్య మొసగు

          నమ్మి యుంటి నమ్మ నవదుర్గవే నీవు

          అభయ మొసగు మమ్మ యాదిశక్తి. "

6.కాత్యాయని.

సింహవాసినియైన పార్వతీదేవి భాద్రపద  బహుళ చతుర్దశి నాడు కాత్యాయన మహర్షి యింట త్రిమూర్తుల ఆశిస్సులతో కాత్యాయని అను పేరుతో అవతరించింది.ఆశ్వీయజమాసంలో నవరాత్రులలో ఆందరి పూజలందుకొని మహిషాసురుని వధించింది.ద్వాపర యుగంలో శ్రీకృష్ణుని పొందుకోరి గోపికలు యమునా నదీ తీరంలో కాత్యాయనీ వ్రతాన్ని ఆచరించారని భాగవతం వల్ల తెలుస్తున్నది.ఈ మాత చతుర్భుజాలతో విరాజిల్లుతూ వుంటుందు.కుడి వైపున ఒక చేతిలో అభయముద్ర,మరో చేతిలోవరముద్ర వుంటుంది.ఎడమ వైపున ఒక చేతిలోఖడ్గము మరో చేతిలో పద్మము వుంటుంది.కాత్యాయనీ మాతను సేవించిన వారికి చతుర్విధ పురుషార్థాలు కలుగుతాయి.అమ్మవారిని కొలవడం వల్ల రోగాలు,శోకాలు,సంతాపాలు,భయాలు తొలగిపోతాయని చెప్పబడింది.

ఆ.వె: భాద్రపదము నందు బహుళ చతుర్దశి

       నవతరించినట్టి యంబ వీవు

     కామితముల నొసగ కాత్యాయనిగబుట్టి

      కోర్కె దీర్చు నంట కొండ చూలి.


మిత్రులందరికీ శుభోదయం

కాళరాత్రి.

దుష్టసంహరణకై  పార్వతీ దేవి "కాళరాత్రి" పేరుతో ఏడవ రోజు అగుపిస్తుంది.

గాఢాంధకారము వలె నల్లని రూపుతో వుంటుంది.ఈమె ఉచ్చ్వాస నిశ్వాసాలు అగ్ని జ్వాలలను వెదజల్లుతుంటాయి.ఈ రూపులో నున్న దేవి వాహనం గార్దభము(గాడిద)చతుర్భుజాలుంటాయి.కుడి వైపున ఒకచేతిలో వరముద్ర మరోచేతిలో అభయముద్ర వుంటాయి.ఎడమ వైపున ఒకచేతిలో ఇనుపముండ్ల ఆయుధము మరో చేతిలో ఖడ్గము వుంటాయి.రూపము భయంకరమైనా భక్తులకు శుభాలను కల్గిస్తూ శుభంకరిగా పిలువబడుతున్నది.ఈమెను స్మరిస్తే రాక్షసులు,భూత ప్రేతాలు భయంతో పరుగు తీస్తారు.భక్తితో ఉపాసించు వారు భయవిముక్తులౌతారు.

ఆ.వె: అగ్ని కీలలయ్యె నంబ నిట్టూర్పులే

        భయము గొల్పు రీతి బయలు వెడలె   

       రాసభమ్ము నెక్కి రౌద్రరూపము తోడ                   

        భద్రకాళి వోలె భవుని రాణి.

2.ఆ.వె: రక్కసులను జంప కక్కసంబగు తీరు

          నవతరించె నచట నాదిశక్తి

         దుస్సహమగు నటుల దుష్టుల పరిమార్చి

        కాళరాత్రి యయ్యె కనకదుర్గ.


మిత్రులందరికీ శుభోదయం

8.మహా గౌరి:

పార్వతీదేవి వృషభవాహనారూఢురాలై చతుర్భుజములతో తెల్లని వస్త్రములతో భక్తులకు దర్శనమొసగుతుంది.కుడివైపు ఒకచేతిలో అభయముద్ర,మరో చేతిలోత్రిశూలము ఎడమ వైపు ఒక చేతిలోడమరుకము,మరో చేతిలోవరముద్ర వుంటుంది.

       శివుని పతిగా కోరి తపము చేయుట వలన ఎండకు కమిలు శరీరము నలుపెక్కగా శివుడు గంగా జలముతో అభిషేకించడంవలన ఈమె శ్వేత వర్ణయై"మహాగౌరి"గా ప్రసిద్ధి చెందింది.ఈ మహాగౌరిని ఉపాసించడం వలన పాపములన్ని నశించి పుణ్య ఫలాన్ని పొందుతారు.

మిత్రులందరికీ శుభోదయం

8.మహా గౌరి:

ఆ.వె:తపమొనర్చె తరుణి ధవునిగా శివుగోరి

      తరణి వేడి వలన తనువు నలయ

     గరళకంఠుని దయఁ గౌర వర్ణము రాగ

    గౌరి యనెడి పేర కరుణ జూపు/ఘనత కెక్కె.

మిత్రులందరికీ శుభోదయం

శరన్నవరాఆత్రులలో తొమ్మిదవరోజు అమ్మవారు సిద్ధి ధాత్రి పేరుతో పూజలందుకొంటుంది.

 భక్తులకు  సర్వ సిద్ధులను ప్రసాదించుట వలన  పార్వతీదేవి "సిద్ధిధాత్రి"గా ప్రసిద్ధి చెందింది.శివుని మేనులో సగభాగమై అర్ధనారీశ్వరతత్త్వానికి ప్రతీకగా నిలిచింది.సింహవాహనారూఢురాలై చతుర్భుజాలతో విరాజిల్లే తల్లికి కుడివైపు ఒక చేతిలోగద మరో చేతిలో చక్రమువుంటాయి.ఎడమ వైపు ఒకచేతిలో శంఖము మరో చేతిలో కమలమువుంటాయి.ఈమెను ఉపాసించడం వలన మనోరథాలన్నీ ఈడేరుతాయనే ధృఢ విశ్వాసం భక్తులకు గలదు.

ఆ.వె: సగము మేను పొంది శంకరు సతి తాను

       సిద్ధిధాత్రి యని ప్రసిద్ధి గాంచె

       శరణు గోరు వారి శంకలు బాపేటి

       నందయంతి మాకు నందమొసగు.


ఆ.వె:పాడ్యమి తిథి నుండి పరమేశు రాణిని
       ప్రస్తుతించి కొల్చి భక్తి తోడ
     విజయదశమి నాడు విజయంబు గోరుచు
     జమ్మి చెట్టు కొలువ జయము లొదవు.

ఆ.వె:సకల జనుల గాచు శక్తిమాతవు నీవె
      భక్తి తోడ గొలుతు భాగ్య మొసగు
      నిన్ను నమ్మి యున్న నీడేరు కోర్కెలు
      విజయ మొసగు మమ్మ విజయ దుర్గ.

కం:పది దుర్గుణములు వీడుచు

    పదిలముగా దైవమందు భక్తిన్నిలలో

   సదనల మతితో  సతతము

  వదలక చేయమని దెలుపు పర్వంబిదియే.

Wednesday, September 27, 2017

అడుగుజాడ గురజాడ

21/9/17
డా.బల్లూరి ఉమాదేవి

పద్యసంఖ్య:,2835నుండి2849 వరకు 15 పద్యములుి


గురజాడవారి జయంతి సందర్భంగా రచించిన పద్యములు.


అడుగుజాడ గురజాడ


1..ఆ.వె:రాయవరము నందు రామదాస సుతుడై

              జనన మొందె ను గురజాడ నాడు

         బాల్యమందె తండ్రి పరమపదించగా

          తల్లి నీడ లోనె తాను/ధరను పెరిగె.



2.సీ:మేలిమి రత్నమై మేనమామల యింట

              జనియించె గురజాడ జగతి యందు

             విద్యలెల్లయు నేర్చి పేదరికము లోనె

                బడిపంతులుగ తాను వాసికెక్కె

             వ్యావహారికమైన భాషకు పట్టము

                 కట్టదలచి నట్టి కవి యితండు

            గిడుగు పంతులతోడ కేలును గలుపుచు

,              గ్రాంథిక వాదుల కచట కమ్మ

  ఆ.వె:   నైన బదులు నొసగి యవనియందీతండు

              ఖిలము కాని యట్టి కీర్తి నంది

                తెలుగు భాషలోన దీటుగా కావ్యముల్

                వ్రాసిఘనత నందె వాసి గాను.


3ఆ.వె:ఆంధ్ర దేశమందు నవతరించి యతడు

      వేగు చుక్క వోలె వెలిగి పోయె

     అంటరాని తనము నంతరింపగచేయ

      కవిత లల్లి గొప్ప కవియునయ్యె.


4.ఆ.వె:ఆంగ్లభాషయందు నల్లె కావ్య మొకటి

     పాతికేళ్ళ పడుచు వయసు నందె

      సంఘ సంస్కరణము సాధించ మొదలిడి

     కలము తోడ తనదు బలము చూపె.


5.ఆ.వె:అడుగు జాడ యయ్యె పుడమిలో జనులకు

      కమ్మనైన కావ్య ఖండికలను

     వ్రాసి దారి చూపి వాసికెక్కిన కవి

     వరున కిడుదు కోటి వందనాలు.


 

6.ఆ.వె:మంచి నెపుడు యిలను పెంచు మని పలికి

      వట్టి మాట వల్ల బాధ మిగులు

     నంచు గట్టి మేలు నయమున చేయంగ

    ఖ్యాతి నందు జాతి ఘనతతోడ


7.ఆ.వె:పిరికి వాడివైన వెనుక బడెద వీవు

        మందగించ కుండ ముందు కేగు

     మనెడి మంచి మాట మరువబోకనుచును

      నలుపు లేక చాటె నవని యందు


8.ఆ.వె:జనుల కుపకరించు చక్కని పనులను

        చేయు మనుచు తాను చేసి చూపె

      పరుల కలిమి గాంచి బాధతో యేడ్చిన

       ఫలిత మేమి టనుచు ప్రశ్న చేసె.


9.ఆ.వె:వర్ణ భేదములను పాటించవలదని

       జాతికి దెలిపె గురజాడ నాడు

       ప్రేమ బంధము నిల ప్రియమార దెల్పుచు

        స్ఫూర్తి దాత యగుచు కీర్తి నందె.


10.ఆ.వె:మూఢ నమ్మకములఁముందుగా ఖండించి

            ప్రజల కెరుక చేయు వాంఛ తోడ

            మేలుకొలుప ప్రజ నలుపులేక

          సాగె నిలను తాను సంఘసంస్కర్తయై

           అడుగు ముందు కేసె జడుపు లేక.



11.ఆ.వె:మంచి తనము నెపుడు పెంచవలెననుచు

     ఆచరించి చూపె నవని యందు

     సంఘ సంస్కరణకు సర్వశక్తులనొడ్డి

      కూర్మితోడ దెచ్చె  గొప్ప మార్పు.


12.ఆ.వె:దిద్దుబాటు వ్రాసి తెలుగు కథకు నయ్యె

        నాద్యుడీ కవివరుడవని యందు

        మాటలాడు భాషె మంచిభాషయటంచు

         వ్రాసి చూపి తాను వాసికెక్కె.


13.ఆ.వె:దేశభక్తి తేట తెల్లము చేయుచు

        అడుగు జాడ యయ్యె నాంధ్ర దేశ

        మందు ,కన్యశుల్క మాది నాటకములు

      వ్రాసి చూపి నాడు ప్రజలకెల్ల.


14.ఆ.వె:మట్టి గాదు గనుము మనుజులే దేశమౌ

           ననుచు చాటి చెప్పె నవని యందు

         పాత కొత్తలకును వారిధి తానయ్యె

         యుగపురుషుడటంచు జగతి మెచ్చె.


15.ఆ.వె:వాడుచున్న భాషె వాసియైనదనెడి

       రామమూర్తిఁగలిసి రక్తి తోడ

      పామరజనులకును పరిచితమైనట్టి

       వ్యావహారికంబు వ్యాప్తి చేసె.




శారదాస్తుతి.

మిత్రులందరికీ శుభోదయం

పేరు:డా.బల్లూరి ఉమాదేవి.
27/9/17

అంశం:   శారదామాత

1కం:.మదిలోనిన్నే దలచుచు

     నుదయాస్తములన్ నుడివెద నోరారంగా

     పదిలముగా సతతము నా

     మదిలో నుండి పలికిించు మంచి పలుకులన్.

ఆ.వె:శారదమ్మ నిన్ను సద్భక్తితో గొల్తు

       మంచివాక్కు లొసగు మమ్మ మాకు

      పదుగురెదుట నిలిచి ప్రతిభఁకనపరచు

     శక్తి నొసగవమ్మ చదువులమ్మ.

ఆ.వె:చదువు సంధ్యలొసగు చల్లని మాయమ్మ

        భక్తి శ్రద్ధలొసగు వాణి మాత

      పుస్తకమ్ము నెపుడు బుద్ధితో చదువంగ

      మనసు నొసగు మమ్మ మరువకుండ.

ఆ.వె:విధికి రాణి వీవు విద్యాధనము నివ్వు

        జగము లెల్ల నిన్ను సన్ను తించు

       కమలనేత్రి మమ్ము కాపాడు కరుణతో

        జంద్రవదన నీకు శరణు శరణు.

5ఆ.వె:చదువు సంధ్యలొసగు శారదాంబకు మ్రొక్కి

        వ్రాయబూనితేను పద్యములను

         దీవనొసగు మమ్మ దేవి భారతిదేవి

          కరము వేడుకొందు కనికరించు.

6.అ.వె:నలువ రాణి వీవు నగుమోముతో మమ్ము

      కరుణ చూపవమ్మ కలికి వాణి

      మంచి వాక్కు నొసగి మాధవు పైభక్తి

       కలుగ చేయ వమ్మ కమలపాణి.

7.ఆ.వె:మంచి మాటలెపుడు మాచేత పలికించు

            మంచి విద్య నేర్వ మనసు నివ్వు

          పదుగురెదుట పల్కు పాండిత్య మబ్బగా,

           శక్తి నొసగు మమ్మ శారదమ్మ.

8ఆ.వె:చేతి యందు వీణ చిలుక ముంజేతిపై

        అంచ నెక్కి తిరుగు నట్టి చాన

      స్ఫటిక మాలదాల్చి సద్భక్తులను బ్రోచు

       శారదాంబ నిన్ను సన్నుతింతు.

9.ఆ.వె:మాఘ మాసమందు మనుజులెల్లరు చేరి

          కోరి కొలుతురమ్మ కూర్మి తోడ

          ఆర్తి బాపి జనుల కాశిస్సు లందిమ్ము

         సకల లోక వంద్య శారదాంబ.

10.ఆ.వె:భాసర పురమందు వాసిగా వెలసిన

       శారదమ్మ నీకు శరణు శరణు

      కచ్ఛపమను వీణ కరమందు దాల్చిన

        వాణి మాత నీకు వందనమ్ము.

11.ఆ.వె:పాట యైన గాని పద్యాల స్పర్ధైన

             నీదు కరుణ యున్న నెగ్గ గలము

          సభల యందు నైన సంగరమున నైన

          విజయ మొసగు మమ్మ విద్దెలమ్మ

12.ఆ.వె:హరికి కోడ లీవు హరిణాక్షి వాగ్దేవి

              అత్త గాదె నీకు నాదిలక్ష్మి

         మీయిరువురి దయను మేము కోరెదమమ్మ

        మమ్ము బ్రోవ రండు మాతలార.

13.కం:అమ్మా వాణీ శారద
           యిమ్ముగ నిన్నే కొలుతును నేనెల్లపుడున్
           కమ్మని దీవెన లొసగుచు
          మమ్మానందింపజేయ మరువకు మమ్మా.

14.కం:కవులకు ప్రాణంబీవే
         కవికోకిలలకు సతతము గళమును నీవే
        కవితాపటిమను పెంచుచు
        కవిగా భువిలో నిలుపగ గమ్మున రావే.

15.కం:విద్యల కధిదేవతవే
          విద్యాదాయనివి నీవు విశ్వము నందున్
       విద్యాధనమును నొసగుచు
       విద్యాదానమొనరించు విజ్ఞత నిమ్మా.

Tuesday, September 12, 2017

ధైర్యము.


శీర్షిక:ధైర్యము.

ఆ.వె:ధైర్యమొక్కటున్న ధరలోన జనులకు
       బలమదెంతొ వచ్చు నెలమి తోడ
       సకల కార్యములును సాధింప వచ్చున
       టంచు బల్కు చుందు రార్యు లిలను.
     
ఆ.వె:దైర్యవంతు లిలను శౌర్యము చూపుచూ
      యుద్ధ రంగ మందు యోధులగుచు
      శత్రు మూకపైన సమరము చేయుచు
      విజయమంద గలరు వెరపు లేక.

ఆ.వె:పిరికివాడవైన వెక్కిరింతురు నిన్ను
     పిరికి తనము వీడ వీరుడౌదు
    ధీరగుణము యున్న దేశమందెల్లడ
     తెగువ చూపగలవు తెగువ తోడ.

ఆ.వె:హడలి పోకు మయ్య నాపదలెదురైన
      పారద్రోలు మయ్య భయము నెపుడు
      ధీరగుణము పెరుగ భీరత్వముండదు
      సాగు నన్ని పనులు చక్కగాను.

ఆ.వె:పిరికితనముతోడ బెరకుగా దాగిన
       తెగడు చుందురయ్య తీరుబడిగ
      ధీరగుణము చూపి పోరాటమును సల్ప
       శౌర్యవంతుడంచు సన్నుతింత్రు.

ఆ.వె:కష్ట మొదవి నపుడు కంట నీరు నిడక
       గడ్డిపోచలల్లె కడకు నెట్టు
       ధైర్యమనెడు శరము దాపున నుండంగ
         సాగవయ్య ముందు సాహసాన.

Tuesday, September 5, 2017

గురువు.

గురుపూజా దినోత్సవ శుభాకాంక్షలు.

శీర్షిక:గురువు.

1ఆ.వె:గురువు లేని విద్య గుడ్డివిద్యందురు
       గురువు బోధ యున్న గురుతు నుండు
      గురువు కరుణ యున్న కురియును వరములు
      నిలను గురువు నున్న బలము గలుగు.                      

2.కం:అఙ్ఞానంబును బాపుచు
      విఙ్ఞానమొసంగునొజ్జ;విశదముగా తా
     ప్రఙ్ఞావంతుల చేయుచు
      సుఙ్ఞానమొసగు గురువుకు జోతలొ సగుదున్.                

3.తే.గీ:.ముగురు మూర్తుల బోలెడి ముఖ్య వ్యక్తి
          తల్లి తరువాత యంతటి తాన మీత
         నిదిల వినయాదికంబులు నేర్పు నట్టి
         గురువు కంటెను వసుధలో గొప్ప యెవరు?.      

             
4.ఆ.వె:రామకృష్ణు లిలను రహముతోనేర్చిరి
        గురువు చెంత చదువు కూర్మి తోడ
        దేవదేవు డైన దీనుడే యైననూ
        గురువు వద్ద నేర్వ గొప్ప యగును.

5.ఆ.వె:చదువు తోడ తాను సంస్కారమును నేర్పి
       ఛాత్ర తతిని పెంచి జగతి యందు
       గురువు నేర్పు చుండు గొప్ప విద్యలనెల్ల
      బుద్ధిమంతు లవగ మురిసి పోవు.

6ఆ.వె:గురిని చూపు వాడు గురువౌను నిలలోన
       తీర్చి దిద్దు తాను తీరుబడిగ
       నుర్వి యందు వార లుత్తములుగ నుండ
       మురిసి పోవు చుండు గురువు తాను.

7.కం:గురువే దైవమటంచును
    నరయుచు భక్తిన్ సతతము నతనికి సేవల్
    నిరతము చేయుచు నుండిన
    హరియును శిష్యున కొసగును హరుషం బెపుడున్.

8.ఆ.వె:విద్య నేర్పునట్టి విజ్ఞాన ఖని యైన
       గురువు నొద్ద నేర్వు గొప్ప చదువు
       మంచిగాను చదువ మదిలోన హర్షించి
            విద్యలెల్ల నేర్పు వేగమతడు.

9.తే.గీ:.ముగురు మూర్తుల బోలెడి ముఖ్య వ్యక్తి
    గురుడు  నతని శిష్యుండవై గొప్పవైన
   విద్య లెల్లను నేర్చుచు వేల్పు వోలె
  నర్చనమొనరించశుభము లబ్బు నెపుడు.

10.కం:అనయము శ్రద్ధను చూపుచు
     వినయము తోడను కొలుచుచు విశ్వాసంబున్
      ననవరతము కనబరచిన
       మనమున మెచ్చుచు గురుండు మమతలు పంచున్.




11ఆ.వె:గురువు దారి జూప గురినిముట్టగలము

      గురువె తల్లి దండ్రి గురువె సర్వ

      మనుచు నెంచి సరిగ నభ్యసింప చదువు

     ఛాత్రులగని గురువు సంతసించు.


12కం:అజ్ఞానమదియుతొలగును

     విజ్ఞానఖనియగు గురువు వెలుగును పంచన్

      సుజ్ఞాన మలవడు మదిలో

     ప్రజ్ఞయు పెరుగును నిజమిది వసుధన్ గనుమా!


13.ఆ.వె:బ్రహ్మ విష్ణు శివులు పాఠముల్ నేర్పెడి

      గురువు లనుచు నుంద్రు కువలయాన

     నట్టి గురువు చెంత నధ్యయనము చేయ

      ఘనుడ వౌదు వపుడు ఖచితమిదియు.

Friday, September 1, 2017

శ్రావణమాసం పద్యాలు.

నవకవితాఝరి గ్రూప్ వారు నిర్వహించిన "శ్రావణమాస కృష్ణాష్టమి"పద్యాలపోటీలో "ప్రత్యేక బహుమతికి"అర్హమైన నేను వ్రాసిన పద్యాలు.

శ్రావణమాసం పద్యాలు.

ఆ.వె:శ్రావణమ్ము వచ్చె సందడి తాతెచ్చె
         చిటపట చినుకులకె చెట్లు మొలచె
         అంబరమ్ము నంటు సంబరమ్మొదవంగ
         నాడపడుచుల కిల హర్ష మయ్యె.

ఆ.వె:శ్రావణంబు ననగ సతులకెల్లరకును
       సంతసంబు కలుగు జగతి యందు
     పాడ్యమి తిథి మొదలు పండుగలనుచును
     జరుపు కొనుచునుంద్రు సంబరాన.

ఆ.వె:సింధు రాజతనయ శ్రీలక్ష్మి రావమ్మ
       చంద్రసోదరి వీవు చంద్రవదన
     వరము లొసగునట్టి వరలక్ష్మి వేనీవు
    కొలువు దీరుమింట కూర్మి తోడ.

ఆ.వె:చారుమతియు నాడు చక్కగా నీవ్రతం
          బాచరించి బడసె భాగ్య రాశి
          నాటి నుండి నిదియు నవలా  మణులకెల్ల
           గొప్ప పండుగయ్యె కువలయమున.

ఆ.వె: సంతసమ్ము తోడ శ్రావణ మాసాన
           పౌర్ణమీ దినమున పడతు లెల్ల
          తోడ బుట్టువులకు తోరము లను గట్టి
        బహుమతందు చుంద్రు వసుధ యందు.

ఆ.వె:దివ్య పర్వ మిదియు ద్విజుల కెల్లరకును
            నుదయ వేళలందు నొప్పు గాను
        సంధ్య వార్చుకొనుచు జంధ్యములను మార్చు
           కొనెడి పౌర్ణమిదియె కువలయాన.

కం:అష్టమ సుతుడై భువిలో
    శిష్టుల కావగ జనించె శ్రీకృష్ణుండై
     దుష్టుల దునిమెద తండ్రీ
     కష్టములిక తొలగునంచు కమ్మగ పలికెన్.

ఆ.వె:కృష్ణ నామ మొకటి తృష్ణను దీర్చును
     కృష్ణ కీర్తనంబు కీర్తి నొసగు
      కృష్ణ కృష్ణ యన్న ఖిలమౌను పాపాలు
    కృష్ణుని గొలువంగ కీడు తొలగు.

ఆ.వె:సతుల కెల్ల జూడ శ్రావణమాసమ
          నంగ కలుగు హర్ష మవని యందు
           పసిడి నగలు దాల్చి పట్టుచీరలు గట్టి
           పర్వమాచరింత్రు పరవశాన.

ఆ.వె:వనిత లెల్ల చేరి వాయనమ్ముల నిచ్చి
          పుచ్చు కొనుచు మదిని ముదము నంది
          ప్రతి దినమునొక్క పర్వదినమ్ముగ
           గడుపుచుందురిలను కాలమిటుల.