Thursday, September 28, 2017

నవదుర్గలు&దసరా పద్యములు.

నవదుర్గలు&దసరా పద్యములు.

మిత్రులందరికీ శరన్నవరాత్రి శుభాకాంక్షలు


నవదుర్గలు:ఆదిపరాశక్తిగా పూజలందుకొనేదేవి త్రిమూర్తుల అంశతో వారి పత్నులైన సరస్వతి,లక్ష్మి,పార్వతు ల నుండి రెండు అంశలతో నవదుర్గగా ఆవిర్భవించిందని పురాణాల ద్వారా తెలుస్తుంది.

   ఈదేవిని గురించిన శ్లోకం

:నవరాత్రి సమారాధ్యాం నవచక్ర నివాసినీం
నవరూప ధరాం శక్తిం, నవదుర్గాముపాశ్రయే


శరన్నవరాత్రులో అమ్మవారు ఒక్కొక్క రోజు ఒక్కొక్క పేరుతో ఒక్కొక్క అలంకారముతో భక్తులకు దర్శన మిస్తుంటారు.

          దేవీకవచంలోనూ,వరాహపురాణంలోను అమ్మవారు ఏరోజు ఎలా వుంటారో ఈశ్లోకంద్వారా వివరించబడింది.

“ప్రథమం శైలపుత్రీ చ ద్వితీయం బ్రహ్మచారిణీ |
తృతీయం చంద్రఘంటేతి కూష్మాండేతి చతుర్థకమ్ ||

పంచమం స్కందమాతేతి షష్ఠం కాత్యాయనీతి చ |
సప్తమం కాలరాత్రీతి మహాగౌరీతి చాష్టమమ్ ||

నవమం సిద్ధిదాత్రీ చ నవదుర్గాః ప్రకీర్తితాః |
ఉక్తాన్యేతాని నామాని బ్రహ్మణైవ మహాత్మనా ||”


మెదటి రోజు శైలపుత్రిగా దర్శనమిస్తుంది.

శైలపుత్రీ
సతీదేవి దక్షయజ్ఞంలో తనువును వీడి మరల పర్వతరాజైన హిమవంతుని యింట పుత్రికయై జన్మించి నందున ఆమెకు శైలపుత్రి అనే పేరు స్థిరమైంది. వృషభవాహనారూఢయైన దేవికి కుడిచేతిలో త్రిశూలము, ఎడమచేతిలో కమలము వుంటుంది.తలపై చంద్రవంకను ధరించి వుంటుంది పార్వతి, హైమవతి ,గిరిజ,అనునవియు ఆమె పేర్లే.



ఆ.వె: దక్ష సుతవు నీవు దాక్షాయణీ దేవి

      దగ్ధమైతి వపుడు దక్షునింట

        హైమవతిగ పుట్టి హరుని సేవించుచు

       శంకరు సతి వైతి శైల పుత్రి.


రెండవరోజు అమ్మవారు బ్రహ్మచారిణి పేరుతో పిలువ బడుతూ పూజలందుకొంటుంది.


బ్రహ్మచారిణి' యనగా తపమాచరించు తల్లి. బ్రహ్మమునందు చరించునది.కుడి చేతియందు జపమాలను, ఎడమచేతియందు కమండలువును ధరించి వుంటుంది పరమేశ్వరుని పతిగా పొందుటకు తీవ్రమైన తపస్సు చేసి ఉమ యని ప్రసిద్ధి వహించెను. ఈ దేవి స్వరూపము జ్యోతిర్మయము. భక్తులకును, సిద్ధులకును అనంత ఫలప్రదము. బ్రహ్మచారిణీ దేవి కృపవలన ఉపాసకులకు నిశ్చలమగు దీక్ష, సర్వత్ర సిద్ధి, విజయము ప్రాప్తించును.

.ఆ.వె: బ్రహ్మచారిణిగనె ప్రఖ్యాతి గాంచిన

          మేన తనయ వమ్మ  మేలు కూర్చు

         ఘోర తపము చేసి గోరితివి భవుని

         పతియు నయ్యె తాను పరమ శివుడు.


మూడవరోజు:

దేవి తన శిరమున దాల్చిన అర్ధచంద్రుడు ఘంటాకృతిలో ఉండుటచే ఈమెకు 'చంద్రఘంట' యను పేరు స్థిరపడెను. ఈమె శరీరము బంగారు కాంతి మయము. ఈమె తన పది చేతులలో ఖడ్గము మొదలగు శస్త్రములను, బాణము మున్నగు అస్త్రములను ధరించియుండును. ఈమె సింహ వాహన. ఈమె సర్వదా సన్నాహయై యుద్ధముద్రలోనుండును. ఈమె గంటనుండి వెలువడు భయంకరధ్వనులను విన్నంతనే క్రూరులై దైత్య దానవ రాక్షసులు ఎల్లప్పుడు వడగడలాడుచుందురు. కాని భక్తులకును, ఉపాసకులకును ఈమె మిక్కిలి సౌమ్యముగను, ప్రశాంతముగను కన్పట్టుచుండును.

ఈ దేవి ఆరాధన సద్యఃఫలదాయకము. భక్తుల కష్టములను ఈమె అతి శీఘ్రముగా నివారించుచుండును. ఈ సింహవాహనను ఉపాసించువారు సింహ సదృశులై పరాక్రమశాలురుగా నిర్భయులుగా ఉందురు. ఏవిధమైన భయములును వారిని బాధింపజాలవు.

ఆ.వె:భక్త జనుల యొక్క పాపాల రాశిని

         తొలగ జేయు నట్టి దుర్గ వీవు

          చంద్ర ఘంట యనుచు చక్కగా కొలిచేము

         కావు మమ్మ మమ్ము కరుణ తోడ.

నాలుగవరోజు అమ్మవారు “కూష్మాండ”అను పేరుతో అర్చింపబడుతుంది.

అవలీలగా బ్రహ్మాండమును సృజించునది గావున ఈ దేవి 'కూష్మాండ' అను పేరుతో విఖ్యాత యయ్యెను. ఈమె సూర్య మండలాంతర్వర్తిని. సాటిలేని ఈమె తేజస్సు నిరుపమానము. ఈమె యొక్క తేజోమండల దశదిశలు వెలుగొందుచున్నవి. బ్రహ్మాండము లోని సకల వస్తువులలో, ప్రాణులలో గల తేజస్సు ఈమె ఛాయయే.

'అష్టభుజాదేవి' అని కూడా పిలువబడే ఈమె ఎనిమిది భుజములతో విరాజిల్లిచుండును. ఏడు చేతులలో వరుసగా కమండలువు, ధనుస్సు, బాణము, కమలము, అమృతకలశము, చక్రము, గద - అనునవి తేజరిల్లుచుండును. ఎనిమిదవ చేతితో సర్వసిద్ధులను, నిధులను ప్రసాదించు జపమాల యుండును. ఈమెయు సింహవాహనయే.

భక్తులు ఈ దేవిని చక్కగా ఉపాసించుటచే పరితృప్తయై ఈమె వారి రోగములను, శోకములను రూపుమాపును. ఈమె భక్తులకు ఆయుర్యశోబలములు, ఆరోగ్యభాగ్యములు వృద్ధిచెందును. కొద్దిపాటి భక్తిసేవలకును ఈదేవి ప్రసన్నురాలగును.

ఆ.వె:అంబ పూజ చేయ హర్షించి దీవించు

       భక్తి తోడ గొలువ వరము లొసగు

      కూరిమెంతొ చూపు కూష్మాండ గౌరియై

         సర్వ సిద్ధు లొసగు శైల పుత్రి.


నవరాత్రులలో ఐదవ రోజు.

"స్కందమాత"

 కార్తికేయుడు,షణ్ముఖుడు,శక్తిధరుడు,గుహుడు అను పేర్లతో ప్రసిద్ధుడైన స్కందుని తల్లి పార్వతీదేవిని స్కందమాత పేరుతో నవరాత్రులలో ఒకరోజు ఆరాధిస్తారు .

సింహవాసినియైన ఈ దేవి చతుర్భుజాలతో దర్శన మిస్తుంది.కుడివైపు ఒకచేత స్కందుని పట్టుకోగా మరో చేతిలోపద్మముంటుంది.ఎడమ వైపు ఒకచేత అభయ ముద్ర మరొక చేత కమలము ధరించి వుంటుంది.స్కందమాతను ఉపాసించుట వలన భక్తుల కోరికలు నెరవేరుతాయి.


ఆ.వె:స్కందమాత వీవు శంకర పత్నివి

         భక్తి తోడ కొలుతు భాగ్య మొసగు

          నమ్మి యుంటి నమ్మ నవదుర్గవే నీవు

          అభయ మొసగు మమ్మ యాదిశక్తి. "

6.కాత్యాయని.

సింహవాసినియైన పార్వతీదేవి భాద్రపద  బహుళ చతుర్దశి నాడు కాత్యాయన మహర్షి యింట త్రిమూర్తుల ఆశిస్సులతో కాత్యాయని అను పేరుతో అవతరించింది.ఆశ్వీయజమాసంలో నవరాత్రులలో ఆందరి పూజలందుకొని మహిషాసురుని వధించింది.ద్వాపర యుగంలో శ్రీకృష్ణుని పొందుకోరి గోపికలు యమునా నదీ తీరంలో కాత్యాయనీ వ్రతాన్ని ఆచరించారని భాగవతం వల్ల తెలుస్తున్నది.ఈ మాత చతుర్భుజాలతో విరాజిల్లుతూ వుంటుందు.కుడి వైపున ఒక చేతిలో అభయముద్ర,మరో చేతిలోవరముద్ర వుంటుంది.ఎడమ వైపున ఒక చేతిలోఖడ్గము మరో చేతిలో పద్మము వుంటుంది.కాత్యాయనీ మాతను సేవించిన వారికి చతుర్విధ పురుషార్థాలు కలుగుతాయి.అమ్మవారిని కొలవడం వల్ల రోగాలు,శోకాలు,సంతాపాలు,భయాలు తొలగిపోతాయని చెప్పబడింది.

ఆ.వె: భాద్రపదము నందు బహుళ చతుర్దశి

       నవతరించినట్టి యంబ వీవు

     కామితముల నొసగ కాత్యాయనిగబుట్టి

      కోర్కె దీర్చు నంట కొండ చూలి.


మిత్రులందరికీ శుభోదయం

కాళరాత్రి.

దుష్టసంహరణకై  పార్వతీ దేవి "కాళరాత్రి" పేరుతో ఏడవ రోజు అగుపిస్తుంది.

గాఢాంధకారము వలె నల్లని రూపుతో వుంటుంది.ఈమె ఉచ్చ్వాస నిశ్వాసాలు అగ్ని జ్వాలలను వెదజల్లుతుంటాయి.ఈ రూపులో నున్న దేవి వాహనం గార్దభము(గాడిద)చతుర్భుజాలుంటాయి.కుడి వైపున ఒకచేతిలో వరముద్ర మరోచేతిలో అభయముద్ర వుంటాయి.ఎడమ వైపున ఒకచేతిలో ఇనుపముండ్ల ఆయుధము మరో చేతిలో ఖడ్గము వుంటాయి.రూపము భయంకరమైనా భక్తులకు శుభాలను కల్గిస్తూ శుభంకరిగా పిలువబడుతున్నది.ఈమెను స్మరిస్తే రాక్షసులు,భూత ప్రేతాలు భయంతో పరుగు తీస్తారు.భక్తితో ఉపాసించు వారు భయవిముక్తులౌతారు.

ఆ.వె: అగ్ని కీలలయ్యె నంబ నిట్టూర్పులే

        భయము గొల్పు రీతి బయలు వెడలె   

       రాసభమ్ము నెక్కి రౌద్రరూపము తోడ                   

        భద్రకాళి వోలె భవుని రాణి.

2.ఆ.వె: రక్కసులను జంప కక్కసంబగు తీరు

          నవతరించె నచట నాదిశక్తి

         దుస్సహమగు నటుల దుష్టుల పరిమార్చి

        కాళరాత్రి యయ్యె కనకదుర్గ.


మిత్రులందరికీ శుభోదయం

8.మహా గౌరి:

పార్వతీదేవి వృషభవాహనారూఢురాలై చతుర్భుజములతో తెల్లని వస్త్రములతో భక్తులకు దర్శనమొసగుతుంది.కుడివైపు ఒకచేతిలో అభయముద్ర,మరో చేతిలోత్రిశూలము ఎడమ వైపు ఒక చేతిలోడమరుకము,మరో చేతిలోవరముద్ర వుంటుంది.

       శివుని పతిగా కోరి తపము చేయుట వలన ఎండకు కమిలు శరీరము నలుపెక్కగా శివుడు గంగా జలముతో అభిషేకించడంవలన ఈమె శ్వేత వర్ణయై"మహాగౌరి"గా ప్రసిద్ధి చెందింది.ఈ మహాగౌరిని ఉపాసించడం వలన పాపములన్ని నశించి పుణ్య ఫలాన్ని పొందుతారు.

మిత్రులందరికీ శుభోదయం

8.మహా గౌరి:

ఆ.వె:తపమొనర్చె తరుణి ధవునిగా శివుగోరి

      తరణి వేడి వలన తనువు నలయ

     గరళకంఠుని దయఁ గౌర వర్ణము రాగ

    గౌరి యనెడి పేర కరుణ జూపు/ఘనత కెక్కె.

మిత్రులందరికీ శుభోదయం

శరన్నవరాఆత్రులలో తొమ్మిదవరోజు అమ్మవారు సిద్ధి ధాత్రి పేరుతో పూజలందుకొంటుంది.

 భక్తులకు  సర్వ సిద్ధులను ప్రసాదించుట వలన  పార్వతీదేవి "సిద్ధిధాత్రి"గా ప్రసిద్ధి చెందింది.శివుని మేనులో సగభాగమై అర్ధనారీశ్వరతత్త్వానికి ప్రతీకగా నిలిచింది.సింహవాహనారూఢురాలై చతుర్భుజాలతో విరాజిల్లే తల్లికి కుడివైపు ఒక చేతిలోగద మరో చేతిలో చక్రమువుంటాయి.ఎడమ వైపు ఒకచేతిలో శంఖము మరో చేతిలో కమలమువుంటాయి.ఈమెను ఉపాసించడం వలన మనోరథాలన్నీ ఈడేరుతాయనే ధృఢ విశ్వాసం భక్తులకు గలదు.

ఆ.వె: సగము మేను పొంది శంకరు సతి తాను

       సిద్ధిధాత్రి యని ప్రసిద్ధి గాంచె

       శరణు గోరు వారి శంకలు బాపేటి

       నందయంతి మాకు నందమొసగు.


ఆ.వె:పాడ్యమి తిథి నుండి పరమేశు రాణిని
       ప్రస్తుతించి కొల్చి భక్తి తోడ
     విజయదశమి నాడు విజయంబు గోరుచు
     జమ్మి చెట్టు కొలువ జయము లొదవు.

ఆ.వె:సకల జనుల గాచు శక్తిమాతవు నీవె
      భక్తి తోడ గొలుతు భాగ్య మొసగు
      నిన్ను నమ్మి యున్న నీడేరు కోర్కెలు
      విజయ మొసగు మమ్మ విజయ దుర్గ.

కం:పది దుర్గుణములు వీడుచు

    పదిలముగా దైవమందు భక్తిన్నిలలో

   సదనల మతితో  సతతము

  వదలక చేయమని దెలుపు పర్వంబిదియే.

No comments:

Post a Comment