Wednesday, September 27, 2017

అడుగుజాడ గురజాడ

21/9/17
డా.బల్లూరి ఉమాదేవి

పద్యసంఖ్య:,2835నుండి2849 వరకు 15 పద్యములుి


గురజాడవారి జయంతి సందర్భంగా రచించిన పద్యములు.


అడుగుజాడ గురజాడ


1..ఆ.వె:రాయవరము నందు రామదాస సుతుడై

              జనన మొందె ను గురజాడ నాడు

         బాల్యమందె తండ్రి పరమపదించగా

          తల్లి నీడ లోనె తాను/ధరను పెరిగె.



2.సీ:మేలిమి రత్నమై మేనమామల యింట

              జనియించె గురజాడ జగతి యందు

             విద్యలెల్లయు నేర్చి పేదరికము లోనె

                బడిపంతులుగ తాను వాసికెక్కె

             వ్యావహారికమైన భాషకు పట్టము

                 కట్టదలచి నట్టి కవి యితండు

            గిడుగు పంతులతోడ కేలును గలుపుచు

,              గ్రాంథిక వాదుల కచట కమ్మ

  ఆ.వె:   నైన బదులు నొసగి యవనియందీతండు

              ఖిలము కాని యట్టి కీర్తి నంది

                తెలుగు భాషలోన దీటుగా కావ్యముల్

                వ్రాసిఘనత నందె వాసి గాను.


3ఆ.వె:ఆంధ్ర దేశమందు నవతరించి యతడు

      వేగు చుక్క వోలె వెలిగి పోయె

     అంటరాని తనము నంతరింపగచేయ

      కవిత లల్లి గొప్ప కవియునయ్యె.


4.ఆ.వె:ఆంగ్లభాషయందు నల్లె కావ్య మొకటి

     పాతికేళ్ళ పడుచు వయసు నందె

      సంఘ సంస్కరణము సాధించ మొదలిడి

     కలము తోడ తనదు బలము చూపె.


5.ఆ.వె:అడుగు జాడ యయ్యె పుడమిలో జనులకు

      కమ్మనైన కావ్య ఖండికలను

     వ్రాసి దారి చూపి వాసికెక్కిన కవి

     వరున కిడుదు కోటి వందనాలు.


 

6.ఆ.వె:మంచి నెపుడు యిలను పెంచు మని పలికి

      వట్టి మాట వల్ల బాధ మిగులు

     నంచు గట్టి మేలు నయమున చేయంగ

    ఖ్యాతి నందు జాతి ఘనతతోడ


7.ఆ.వె:పిరికి వాడివైన వెనుక బడెద వీవు

        మందగించ కుండ ముందు కేగు

     మనెడి మంచి మాట మరువబోకనుచును

      నలుపు లేక చాటె నవని యందు


8.ఆ.వె:జనుల కుపకరించు చక్కని పనులను

        చేయు మనుచు తాను చేసి చూపె

      పరుల కలిమి గాంచి బాధతో యేడ్చిన

       ఫలిత మేమి టనుచు ప్రశ్న చేసె.


9.ఆ.వె:వర్ణ భేదములను పాటించవలదని

       జాతికి దెలిపె గురజాడ నాడు

       ప్రేమ బంధము నిల ప్రియమార దెల్పుచు

        స్ఫూర్తి దాత యగుచు కీర్తి నందె.


10.ఆ.వె:మూఢ నమ్మకములఁముందుగా ఖండించి

            ప్రజల కెరుక చేయు వాంఛ తోడ

            మేలుకొలుప ప్రజ నలుపులేక

          సాగె నిలను తాను సంఘసంస్కర్తయై

           అడుగు ముందు కేసె జడుపు లేక.



11.ఆ.వె:మంచి తనము నెపుడు పెంచవలెననుచు

     ఆచరించి చూపె నవని యందు

     సంఘ సంస్కరణకు సర్వశక్తులనొడ్డి

      కూర్మితోడ దెచ్చె  గొప్ప మార్పు.


12.ఆ.వె:దిద్దుబాటు వ్రాసి తెలుగు కథకు నయ్యె

        నాద్యుడీ కవివరుడవని యందు

        మాటలాడు భాషె మంచిభాషయటంచు

         వ్రాసి చూపి తాను వాసికెక్కె.


13.ఆ.వె:దేశభక్తి తేట తెల్లము చేయుచు

        అడుగు జాడ యయ్యె నాంధ్ర దేశ

        మందు ,కన్యశుల్క మాది నాటకములు

      వ్రాసి చూపి నాడు ప్రజలకెల్ల.


14.ఆ.వె:మట్టి గాదు గనుము మనుజులే దేశమౌ

           ననుచు చాటి చెప్పె నవని యందు

         పాత కొత్తలకును వారిధి తానయ్యె

         యుగపురుషుడటంచు జగతి మెచ్చె.


15.ఆ.వె:వాడుచున్న భాషె వాసియైనదనెడి

       రామమూర్తిఁగలిసి రక్తి తోడ

      పామరజనులకును పరిచితమైనట్టి

       వ్యావహారికంబు వ్యాప్తి చేసె.




No comments:

Post a Comment