వింజమూరివారి పోటీ
"మనమే ప్రపంచం కాదు
ప్రపంచంతో పాటు మనం"
ఈభావం వ్యక్తమగునటుల వ్రాసిన పద్యములు.
1.ఆ.వె: పుట్టి పెరిగినట్టి పుడమిని విడనాడి
నాది,నాకు యనెడి నాశ పెరుగ
కన్న వారి నొదిలి వున్న వూరిని వీడి
పయన మైతి వేల బస్తి కిపుడు.
2.ఆ.వె:బుద్ధి వచ్చు వరకు పోషించె జనకుండు
రక్తమాంసములను రంగరించి
పెంచి పెద్ద చేసె ప్రకృతి వనరులిచ్చి
స్వార్థ బుద్ధి తోడ వదల బోకు.
3.ఆ.వె: జగతి యేమి యొసగె జంజాట మనబోకు
జగతి కొసగు నట్టి సంచి యేది
స్వార్థ పరత వీడి సాధించు ప్రగతిని
అంతులేని ముదము నందగలవు.
4.ఆ.వె:సంఘ మన్న నెవరు సరిగ నరయుమయ్య
నీవు నీది కాదు నెరుగ వయ్య
సంఘమందు నీవు సభ్యుడ వేనోయి
శ్వాసయుండు వరకు సత్యమిదియె.
5.ఆ.వె:మంచి చేయుచుండ మహిలోన మెత్తురు
పరుల కెగ్గు జేయ పాపి వండ్రు
పరుల హితము కోర బ్రతుకు పావనమౌను
మంచి పథము నడచి మన్ననందు.
నమస్తే.ఈపద్యములు నా స్వంత రచన.ఇవి దేనికి అనుసరణకాని,అనుకరణకాని కావని సవినయముగా తెలుపుచున్నాను.
ధన్యవాదములతో
శ్రీమతి ఉమాదేవి బల్లూరి
No comments:
Post a Comment