మహిళ-----నాడు_____నేడు.
వేదకాలంనుండి స్త్రీ ఆరాధ్య దేవతగా పరిగణింప బడుతూ వుంది.అందుకే అందరి కంటే ముందుగా మనం నమస్కరించేది అమ్మకే.సర్వసంగ పరిత్యాగి యైన సన్యాసి కూడ తల్లికి మాత్రమే నమస్కరిస్తాడు.అందుకే "మాతృదేవోభవ "అంటూ తల్లికి__"స్రీ"కి మొదటి స్థానమివ్వబడింది.తండ్రి,ఆచార్యుల స్థానాలు తరువాతివే.
మనసమాజంలో పూర్వకాలంనుండి "మహిళ"కు ప్రత్యేక స్థానం ఇవ్వబడుతూవుంది."ఇంటిని చూచి ఇల్లాలిని చూడు"అనేఆర్యోక్తిలోనే స్త్రీ నైపుణ్యం వ్యక్తమౌతుంది.కేవలం ఇంటినే కాదు దేశ సంస్కృతిని నాగరికతను తెలుసు కోవడంలో కూడా స్త్రీ జాతికి ప్రత్యేక ప్రతిపత్తి వుంది.
మనుస్మృతిలో
"యత్ర నార్యన్తు పూజ్యంతే రమంతే తత్రదేవతాః
యత్ర తాస్తున పూజ్యన్తే సర్వస్తత్రా ఫలాక్రియాః"
ఎక్కడైతే స్త్రీలు పూజింప బడతారో (గౌరవింప బడతారో) అక్కడ దేవతలు కూడా సంతోషిస్తారు.ఏపిల్లలకైనా తల్లే మొదటి గురువు.గురుకులంలో ప్రవేశింప చేయడానికి ముందు పిల్లలకు విద్యాబుద్ధులు నేర్పి తగిన శిక్షణ తల్లే ఇచ్చేది.వేదకాలంలో స్త్రీ విద్యావంతురాలని,సంతానానికి విద్య నేర్పడంలో ప్రధానురాలని తెలుస్తున్నది.
"బృహదారణ్యకోపనిషత్"లోగార్గీ యాఙ్ఞవల్క్యుల సంవాదం ప్రధానమైంది."గార్గి" స్త్రీ.అంటే వేదకాలంలో స్త్రీలు పురుషులతో సమానంగా బ్రహ్మచర్య మవలంబించి గురుకుల వాసంలో వేదవేదాంగాల నభ్యసించే వారని తెలుస్తున్నది.నాటి కాలంలోనే "సహ విద్యార్జన"(co education)వుండే దనే విషయం స్పష్టమౌతుంది స్త్రీలను గౌరవాదరాలతో చూడాలని వారి కంట నీరు రాకుండా చూసుకోవాలనీ,వారు బాధ పడితే ఆఇంట్లో సిరిసంపదలుండవని నీతిశతకాలుబోధిస్తున్నాయి.
"కులకాంత తోడ నెప్పుడు
కలహింపకు వట్టి తప్పు ఘటియింపకుమీ
కలకంఠి కంట కన్నీ
రొలికిన సిరి ఇంట నుండ నొల్లదు సుమతీ.!"
అన్నాడు సుమతీశతకకారుడు.
మామూలు మానవులే కాదు దేవతలు అందులో "త్రిమూర్తులు "కూడా తమ భార్యలకు సముచిత స్ధానాన్నిచ్చి గౌరవించారని మన ఆదికవి నన్నయ ఆంధ్రమహాభారతంలో ఆది పద్యంలో తెలిపారు.
"శ్రీవాణీ గిరిజా శ్చిరాయ దధతో వక్షో ముఖాంగేషు యే
లోకానాం స్థితి మావహంత్య విహితాం స్త్రీ పుంస యోగోద్భవాం
తేవేదత్రయ మూర్తయ స్త్రీ పురుష స్సంపూజితా వస్సురై
ర్భూయాసుః పురుషోత్తమాంబుజభవ శ్రీకంధరా శ్రేయసే."
అంటే విష్ణువు వక్షస్థలంలోనూ,బ్రహ్మ నోటిలోనూ,శివుడుఏకంగా శరీరంలలో సగభాగంగానూ భార్యలను ధరించారని వారి సహకారంతోనే సృష్టి స్థితి లయ కార్యాలను నిర్వహిస్తున్నారని భావం.
ఇదే విషయాన్ని ప్రజాకవి వేమన కాస్త వ్యంగ్యంగా
"పడతి మోసె నొకడు పడతి మేసెనొకడు
పడతి నురము నందు చేర్చి బ్రదికె నొకడు
పడతి కొరకె పెక్కు పాట్లను పడిరయా
విశ్వదాభిరామ వినుర వేమా!"
అంటూ వివరించాడు.
మన పురాణేతిహాసాల్లో కూడా "స్త్రీ" ధీరురాలిగా తన మాటను నెగ్గించు కోగల్గిన వనితగా వివరింప బడినది.
రామాయణంలో కైక దశరథునకు దేవాసుర సంగ్రామంలో సహకరించి వరాలు పొందినట్లు తెలుస్తుంది.ఆ వరాల కారణంగా శ్రీరామచంద్రుడు వనవాసానికి వెళ్ళవలసి వచ్చింది.కానీ అది "రావణసంహారంకోసమే "అలా జరిగింది.మరి "సీతో".ఆమెను కైక అడవుల కెళ్ళమనలేదు.కాని సీత"రాముడున్నచోటే నాకు అయోధ్య" అంటూ స్వచ్ఛందంగా అడవుల కెళ్ళింది.ఇక "ఊర్మిళ " 14 సంవత్సరాలు భర్తకు దూరమై అయోధ్యలో నిద్రాదేవి ఒడిలో సేద దీరింది.
భారతంలో ద్రౌపది అయోనిజ .భర్తలతో పాటు కష్టసుఖాలను అనుభవించిన ఆదర్శ మహిళ.
ఇక దమయంతి,చంద్రమతి,సావిత్రి,సుమతి ఇలా ఎందరో స్త్రీలు ఎవరి బలవంతం కానీ సాయంకానీ లేకుండా తమ భర్తలను కాపాడు కొన్నారు.అసాధ్యమైన పనులను సుసాధ్యం చేసుకొని విజయం సాధించారు."అబలలు కాదు సబలలం"అని నిరూపించుకొన్నారు.
తరువాతి కాలంలో ఎన్నో కారణాలవల్ల స్త్రీ స్థానం సమాజంలో తగ్గుతూ వచ్చింది.రాజకీయ కారణాలవల్ల,దండయాత్రల వల్ల "స్త్రీ"మాన ప్రాణాలకు రక్షణ కరువైంది.వేదాలలో చెప్పిన "న స్త్రీ స్వాతంత్ర్య మర్హసి" అనే వాక్యాన్ని మాత్రమే పట్టుకొన్నారు.
"పితా రక్షతి కౌమారే -భర్తా రక్షతి యవ్వనే
సుతా రక్షతి వార్ధక్యే -న స్త్రీ స్వాతంత్ర మర్హసి".
ఇందులో మొదటి మూడింటిని వదిలేశారు.శారీరకంగా "స్త్రీ"అబల బలహీనురాలు కాబట్టి చిన్నప్పుడు తండ్రి, వివాహానంతరం భర్త,వృద్ధాప్యంలో కుమారుల రక్షణ అవసర మనే భావాన్ని వదిలేసి "న స్త్రీ స్వాతంత్రమర్హసి"అనే చివరి పంక్తిని పట్టుకొన్నారు.
ఇక స్త్రీ వాదం,స్త్రీ స్వాతంత్ర్యం అనేవి ఇప్పుడిప్పుడే పుట్టుకొచ్చినవి కావు.చరిత్రలో రుద్రమదేవి ,నాయకురాలు నాగమ్మ , ఝాన్సీలక్ష్మీబాయి,అహల్యాబాయి,ఇందిరాగాంధీ మొదలైనవారు ఆత్మ స్థైర్యంతో ధైర్యంతో యుద్ధాలు చేసి రాజ్యాలేలి విజయాలు సాధించి చరిత్రను సృష్టించిన మహిళా మణులెందరో వున్నారు.
యుద్ధరంగంలోనే కాదు కవనరంగంలో కూడా తాళ్ళపాక తిమ్మక్క ,కవయిత్రి మొల్ల,రంగాజమ్మ,గంగాదేవి మొదలైన ప్రాచీన కవయిత్రులతో పాటు తెన్నేటి హేమలత,వోల్గా,యద్ధనపూడి సులోచనారాణి,మాదిరెడ్డి సులోచన,కోడూరి కౌసల్యాదేవి,ఇంకా ఎందరో ఆధునిక రచయిత్రులు ఖ్యాతినందిన/నందుచున్న వారెందరో ఉన్నారు.కేవలం కదన,కవన రంగాల్లోనే కాదు సేవారంగంలో కూడా సాటిలేని సేవలందించిన సరోజినీనాయుడుగారు,దుర్గాబాయిదేశముఖ్ గారు.కనపర్తి వరలక్ష్మమ్మగారు,అనీబిసెంట్ గారు,మదర్ థెరిస్సాగారు,వంటి మహిళలెందరో మనకు ఆదర్శప్రాయులుగావున్నారు.
ముదితల్ నేర్వగ రాని విద్యగలదే ముద్దార నేర్పింపగాన్ "అన్నట్లు దేశాధ్యక్షులుగా శ్రీమతి ప్రతిభాపాటిల్ గారు "మేటిమహిళ ప్రథమ మహిళగా" ఖ్యాతినందారు.అదేవిధంగా స్పీకర్ గా మీరాకుమార్ గారు బాధ్యతలను నిర్వర్తించారు.భారతరత్న MS సుబ్బలక్ష్మి,పరుగులరాణి pt ఉష,క్రీడాకారిణీ సానియా,రోదసిలో పయనించిన కల్పనాచావ్లా,సింధు,ఇలా ఎందరో మహిళలు విభిన్న రంగాలలో ప్రతిభను కనబరుస్తూ దేశఖ్యాతిని ఇనుమడింప చేస్తున్నారు.
నేడు మహిళలు అన్ని రంగాల్లో శరవేగంతో దూసుకు పోతున్నారు.క్రీడల్లో,రాజకీయాల్లో,విద్యా వ్యాపార,వైద్య రంగాలలో పరిశోధనా,సామాజిక రంగాల్లో రాణిస్తున్నారు.ఐతే నాణానికి బొమ్మా బొరుసు వున్నట్లే ఓవైపు ప్రగతి పథంలో పయనిస్తున్నా మరోవైపు మాత్రం సమస్య "ఎక్కడవేసిన గొంగడిఅక్కడే వుంది."అన్నట్లుంది.మహిళల్లో ఆభద్రతా భావంపెరుగుతూ వుంది.విద్యావంతుల శాతం పెరుగు తూనే వున్నా స్వతంత్రంగా వుండేవారి సంఖ్య తక్కువగానే వుంది.
గాంధీజిగారు "ఆడది అర్ధరాత్రి స్వేఛ్ఛగా తిరిగి నపుడే నిజమైన స్వాతంత్ర్యం వచ్చినట్లు"అన్నారు.కానీ అర్ధరాత్రి కాదుగా పట్టపగలే ఆడది తిరిగే స్థితిలోలేదు.గతంలో "నిర్భయను"గూర్చి విన్నాం.సానుభూతిని చూపాం .కంటతడి పెట్టుకొన్నాం.ఆమె పేరు మీదుగా చట్టం కూడా వచ్చింది.కానీ అత్యాచారాల సంఖ్య తగ్గడం లేదు.మరీ పసి పిల్లలపై కూడా అఘాయిత్యాలు తగ్గడంలేదు.వరకట్నాల చావులు తగ్గడం లేదు.గృహహింస తగ్గడం లేదు.సమాజంలో సగభాగమైన మహిళలు ఇప్పటికైనా మేల్కొనాల్సిన అవసరం ఎంతైనా వుంది.
"ఎవరో వస్తారని ఏదో చేస్తారని "ఎదురు చూడకుండా మన సమస్యలను మనమే పరిష్కరించే దిశలో అడుగులు వేయాలి.పిరికి తనం వదిలేయాలి.ఆ---మనకెందుకులే అనే నిర్లిప్తభావాన్ని వదిలి అవసరమైనపుడు "ఆడపులు"ల్లా గర్జించాలి.వీటన్నింటికంటే ముందు ఒకరితో వేలెత్తి చూపించుకొనేలా మన ప్రవర్తన వుండకూడదు.మన జాగ్రత్తలో మనముండాలి.ముఖ్యంగా వస్త్రధారణలో,వేషభాషల్లొ ఆధునిక పోకడలకు ఆకర్షితులై మనకు మనమే హాని చేసుకొంటున్నాం.పాశ్చాత్య మోజును వదిలి మన సంస్కృతీ సంప్రదాయాలను గౌరవిద్దాం.మన సంస్కారాన్ని చాటుదాం.
విక్టోరియా,మార్గరేట్ థాచర్,సిరిమావో బండారి నాయకి ,ఇందిరాగాంధి,ఏంజలినా మొదలైన మహిళలు ఇంటినేకాదు దేశాలను కూడ సమర్థవంతంగా నడిపారనేది జగమెరిగిన సత్యం.
వేమన దృష్టిలో "మహిళ"
అల్పాక్షరాలలో అనల్పార్థాన్ని చెప్పగలవాడే నిజమైన కవి.మఱ్ఱి విత్తనమంత పద్యంలో మఱ్ఱి చెట్టంత అనుభవాన్ని'వ్వగలవాడే మహాకవి.ఈ లక్షణాన్ని తిక్కన సోమయాజి తరువాత అంత చక్కగా పొందు పరచినవాడు ప్రజాకవి యైన వేమన అని పండితుల అభిప్రాయం.ఇతడు 17 వ శతాబ్దానికి చెందిన కవి."విశ్వదాభిరామ వినుర వేమ" అనే మకుటంతో వందల కొద్దీ పద్యాలు వ్రాసిన తాత్త్వికుడు.తన జీవితానుభవాలనే పద్యాలుగా వ్రాసి ప్రజలను మేల్కొలిపిన ప్రజాకవి.శ్రీ రాళ్ళపల్లి అనంతకృష్ణ శర్మగారన్నట్లు వేమనకు అతీంద్రియాలైన తత్త్వాలను తెలుసుకోవాలన్న ఆశ,వానిని సాధించాలన్న పట్టుదల..సాహసం,తనకు తెలిసిన దానిని నిర్భయంగా చెప్పేధైర్యం ,చురకత్తి లాంటి కవితా శక్తి,సూక్ష్మదృష్టి,అన్నింటికి మించిన హాస్యకుశలత వున్నాయి.వేమన పద్యాలు భావంలో శైలిలో సూటిగా,సరళంగా ఆచ్చమైన తెనుగుతనాన్ని కలిగి వుంటాయి.అన్వయ కాఠిన్యత ఎక్కడా వుండదు.సంఘసంస్కరణార్థమే వేమన పద్యాలు వ్రాసినట్టుగా అనిపిస్తోంది.
వేమనకు స్త్రీలంటే అపారమైన గౌరవం వున్నట్లు ఆయన పద్యాల వల్ల తెలుస్తుందిపరస్త్రీలను తల్లిలా భావించాలంటాడు.సుగుణవంతులైన స్త్రీల నెంతగా మెచ్చుకొన్నాడో దుర్గుణవతుల నంతగా చీదరించు కొన్నాడు.తనకు తోచిన విషయాన్ని ,తాను సత్యమని నమ్మిన విషయాన్ని చెప్పడానికి వెనుకాడలేదు.వారు త్రిమూర్తులైనా సరే!మరెవ్వరైనా సరే అంతే.
వేమన దృష్టిలో ప్రతి స్త్రీ తల్లే.అట్టి స్త్రీ మూర్తిని ప్రబంధ కవులు భోగ వస్తువుగా పరిగణించడాన్ని వేమన తీవ్రంగా నిరసించాడు.ఇతని కాలం నాటికే జనులలో స్త్రీ లోలత్వం,వ్యభిచారం ఎక్కువగా వుండేది.ప్రబంధ నాయికలు పతి సేవానురక్తులుకారు.ఆ కాలపు కవులు స్త్రీల నడకను,నాట్యాన్ని స్వర్గంగా వర్ణించారు.వాస్తవ జగత్తులో దేవదాసీలు,బసివినులు వుండేవారు.వీరి లక్ష్యం పరపురుషులను వలలో వేసుకోవడమే.ఇలా వ్యభిచరించే స్త్రీలను వేమన తీవ్రంగా నిరసించాడు.
స్త్రీల పట్ల (భార్య)వ్యామోహం పెంచుకొన్న దేవతలను సైతం నిరసించాడు.
నాణానికి బొమ్మాబొరుసు వున్నట్లు ప్రతి విషయంలోనూ మంచి చెడు రెండూ వుంటాయి.వేమన తన పద్యాల్లో రెండింటిని పరామర్శించాడు.ఉత్తమ స్త్రీలను,మంచి భార్యలను ఎంతగా నుతించాడో దుర్మార్గులైన భార్యలను వ్యభిచారం చేసే స్త్రీలను అంతగా ద్వేషించాడు.
'మాతృదేవోభవ'.తల్లి దైవంతో సమానం.ఈ
విషయా న్ని వివరిస్తూ
"తల్లి నెరుగువాడు దైవంబు నెరుగును
మన్ను నెరుగు వాడు మిన్ను నెరుగు
మన్ను మిన్నెరిగెనా తన్ను తానెరుగురా
విశ్వదాభిరామ వినురవేమ."
తల్లిని గుర్తించిన వాడు దైవాన్ని గుర్తిస్తాడంటూవివరించాడు. కామాంధకారంలో కన్ను మిన్ను కానక సంచరించే వారికి స్త్రీ స్థానాన్ని తెలియచేశాడు.పరకాంత తల్లితో సమానమంటూ
"తన్ను గన్న యట్టి తల్లి వంటిది సుమ్మి
అన్యకాంత న్యాయ మరసి జూడ
కన్న దాని జనులు కానంగ లేరయా
విశ్వదాభిరామ---------"
ఇతని దృష్టిలో భార్యకూడా తల్లి వంటిదే.
"ఆలనగా ఆత్మ సుమీ
ఆలనగా నమ్మ సుమ్మి యరయం మదిలో
నాలమ్మ యనగా నెవ్వరొ
నాలయము గదీ నితెలియ వలయును వేమా"
అందుకే భార్యను ఆత్మతో పోల్చాడు.తానే మరో రూపంలో స్త్రీ లో బీజరూపాన జన్మించడం వలన ఆమె తల్లి వంటిదని,కనుక ఆమెను తల్లి లాగే ప్రేమానురాగా లతో చూడాలని ఇతని భావం.
ఈ ప్రపంచంలో తల్లి ప్రేమ యొక్కటే శాశ్వితమని ఇతని ప్రగాఢ విశ్వాసం.
"నాతి పైన ప్రేమ నానాటికిని రోత
జ్యోతి పైన ప్రేమ చూడగాను
మాతృ ప్రేమ యొకటె మర్యాద దాల్చును
విశ్వ----=="
మోహాన్ని కలిగించే స్త్రీ పై రోతెపుడు పుడుతుందో అప్పుడే ఆత్మ(జ్యోతి)దర్శనం కల్గుతుంది.అదే స్వచ్ఛమైన మాతృప్రేమకు సాటిగా మర్యాద నిలుపుతుందని కవి భావన.తల్లి దండ్రులను గూర్చి యిలా వివరిస్తున్నాడు.
"వెలయ భూమి తల్లి విత్తనంబు దండ్రి
పంట లరయ సుతులు పాడి పరము
ధర్మమె దనపాలి దైవంబు తలపోయ
విశ్వ దాభిరామ------"
మానవులకు భూమి తల్లి.విత్తనం తండ్రి.పంటలు సంతానం.పాడి స్వర్గం.ధర్మమే దైవము.ధర్మ స్వరూపమైన దైవాన్ని చేరుకోవడానికి తల్లే మూలము.అందుకే తల్లిని తండ్రి కంటే ఎక్కువగా పూజించ మంటాడు.సర్వసంగ పరిత్యాగియైన సన్యాసి కూడ మాతృదేవోభవ అంటూ తల్లికి నమస్కరిస్తాడు.
దైవ స్వరూపమైన అట్టి తల్లిని నిరసిస్తే వచ్చే ఫలాన్ని వివరిస్తూ పరశురాముడి కథను గుర్తు చేస్తున్నాడు.
" తండ్రి మాటలు విని తల్లినితెగటార్చి
పరశు రాముడేమి ఫలము గనియె
నిలువ నీడ లేక మలయాద్రి నుండడా
విశ్వదాభి రామ ------ "
జన్మ నిచ్చిన తల్లిని తండ్రి మాటలు విని చంపాడు.దానివల్ల అతడు పొందిన ఫలమేమియును లేదు.కాని నిలువ నీడకూడ లేక మలయపర్వతంపై తలదాల్చుకోవాల్సి వచ్చింది కదా!
అనుకూలవతియైన భార్య దేవత వంటిది.ఆట్టి ఇల్లాలున్న గృహము దేవతాగృహమట.దీన్ని వివరిస్తూ వేమన
"గుణవతి గల గృహము గోము నందించును
చీకటింట దివ్వె వెలుగు నట్లు
దేబె యున్న కొంప దివ్వె మల్పిన యట్లు
విశ్వదాభి రామ--------"
గుణవంతురాలైన స్త్రీ ఇంటి శోభను ఇనుమడింప చేస్తుంది.అదే గుణహీనురాలు ఇల్లాలైతే ఆఇల్లు దీపమార్పిన ఇల్లులా వుంటుందట.
సౌశీల్యము గల స్త్రీ భార్యగా వుంటే ఎలా వుంటుందో వేమన ఇలా తెలియ చేస్తున్నాడు.
" శీలము గల సుందరి తన
యాలైనను స్వర్గమేల నైహిక సుఖమే
శీలము లేనిది చూడగ
కాలుని పటుదూత యగును కదరా వేమా"
శీలమున్న స్త్రీ ఇల్లాలైతే రంభాది స్త్రీలున్న స్వర్గం అవసరం లేదట.మరి శీలం లేని ఆడది భార్యగా వస్తే ఆమె యమదూత వలె కష్టాలు కల్గిస్తూ వుంటుందట.
అదే భార్య మంచిదైతే సంపదలన్నీ వున్న ట్లేనట.
"సతికి పతికి నైన సంపదే సంపద
పుత్ర సంపదయును భువిని మేలు
సరస ముదిసి బ్రతుకు సంపదే సంపద
విశ్వదాభిరామ-------"
భార్యాభర్తలు అనుకూలమైన దాంపత్యాన్ని పొందడం మంచి సంతానాన్ని కల్గివుండడం,అనుకూలవతియైన భార్య వృద్ధాప్యంలో తోడు నీడగా జీవించడం-----ఇవే నిజమైన సంపదలు.అందుకే వేమన ఇలా అంటాడు
"సుగుణ వంతురాలు సుదతి యై యుండిన
బుద్ధిమంతులగుచు పుత్రు లొప్పు
స్వర్గమేటికయ్య సంసారి కింకను
విశ్వదాభి రామ-------"
గుణవంతురాలైన భార్య,బుద్ధిమంతులైన పిల్లలు వుంటే అంతకంటే స్వర్గం మరోటి లేదు.ఇల్లే స్వర్గం అన్పిస్తుందని ఘంటాపథంగా చెపుతున్నాడు వేమన.కానీ ఇవన్ని ఇల్లాలుమంచిదై నప్పుడు మాత్రమే.మరి ఆమె మంచిదికాకపోతే,గయ్యాళిదైతే --ముందుగామంచిమాటలతో అదుపులో పెట్టుకొనే ప్రయత్నం చేయాలట.అది వీలుకాకపోతే ఆమెను వదిలి అడవుల్లో వెళ్ళడమే మేలంటాడు వేమన.
" ఆలి నొంచలేక యధమత నొందుచు
వెనుకనుంటి ననుట వెర్రి తనము
చెట్టు ముదిరె నేని చిదిమినా బోవునా
విశ్వదాభిరామ----"
మొక్కగా వున్నపుడే చెట్టును వంచాలి.అలాగే భార్యను కూడ మొదట్లోనే అదుపులో వుంచుకోవాలట!చేయి దాటాక చింతించి ప్రయోజనం లేదంటాడు వేమన.
భార్య అంటే ఎవరో ఎలా వుండాలో చెపుతూ
"ఆలన గల సౌఖ్యములకు
నాలయ మగునేని దాని నాలన వచ్చున్
ఆలాగున కాకుండిన
కాలుని పెనుదూత యెయది కదరా వేమా."
భార్య అంటే భర్తకు సహకరిస్తూ సుఖాలందించే ఆలయంకావాలి కాని బాధ కల్గించే యమదూత కాకూడదని అంటూ మాట వినకపోతే
"ఆలు మగని మాట కడ్డంబు వచ్చెనా
ఆలు గాదు నుదుటి వ్రాలు గాని
అట్టి ఆలును విడిచి అడవి నుండుట మేలు
విశ్వదాభిరామ-----"
ఆమెను వదిలి అడవి చేరడం మేలంటాడు.మాట వినని భార్య సంకెల వంటిదని ఇతని భావం.
"మాట వినని యాలు మగనికి బంధాలు
దాని చేర మాన ప్రాణ హాని
అట్టి ఆలి విడిచి అడవి నుండుట మేలు
విశ్వదాభిరామ--------"
మాట వినని భార్య సంకెల వంటిదట.ఆమె వల్ల మాన ప్రాణ హాని కల్గ వచ్చు.కావున అటువంటి భార్యను విడిచి అడవిలో వుండడం మేలని ఇతని భావం.
మంచి భార్య రావాలన్నా మంచి భర్త దొరకాలన్నా స్త్రీ పురుషులిద్దరికి అదృష్టముండాలంటాడు.
"పురుష భాగ్యముననె పుణ్యవతి దొరకు
పుణ్యవతికి నట్టె పుట్టు సుఖము
నిరువురనుభవింప హితులును పుత్రులు
అష్ట భోగములును అమరు వేమ."
మగవాడి అదృష్టం కొద్ది మంచి భార్యలభిస్తుంది.తద్వార ఆమె సుఖ పడుతుంది.ఇద్దరి అదృష్టం మీద ఆధారపడి సమస్త భోగాలమరుతాయి.సత్సంతానము కలుగుతుంది.
భార్య ఎలా వుండాలి?ఆమెకు ముక్తి ఎలా కలుగుతుందనే విషయాన్ని వేమన ఇలా వివరిస్తున్నాడు.
"మగని మీద భక్తి మానకుండిన కాంత
మూడు లోకములను ముక్తి గనును
మగువ లందరకును మగలె దేవతలయా
విశ్వదాభిరామ---------"
భర్తను ఎక్కువ సేవించే స్త్రీలకు ముక్తి లభిస్తుందట.ముల్లోకాల్లో కీర్తవస్తుంది మగువలకు పతియే ప్రత్యక్ష దైవమని ఇతని అభిప్రాయం.దీన్ని బలపరస్తూ
"నాథుడున్నయట్టి ననబోడి యాతని
దేవు డనుచు నెంచి సేవ చేయ
దగును,కాని యొరుని దానంట వచ్చునా
విశ్వదాభిరామ----------=."
పతిని దైవంగా భావించి సేవించాలి.అంతేకాని పరుల వెంట పోరాదని హితవు చెపుతున్నాడు.
"మాన ధనము విడదు మరిపుణ్యవతి యైన
పూని పతిని భక్తి పొసగ చేయు
లోన మెచ్చు చుండు లోగుట్టు గనవలె
విశ్వదాభిరామ -------------."
పుణ్యవతి యైనస్త్రీ తన మర్యాదను కాపాడుకొంటూ భర్తను భక్తితో సేవిస్తుంది.మనసులో పతిని ఆరాధించగల నేర్పున్న భార్యను ఆమె అంతరంగపు లోతుల్లోకి తొంగి చూస్తే కాని ఆమె అర్థంకాదు.అలాకాక భర్తను నిందించే భార్యకు దుర్గతి తప్పదంటాడు.
"పడతి భావమందు పరమాత్మగా నెంచు
పడతి కమరు గతిని పరమ టండ్రు
పతిని దూరు నట్టి పడతికి దుర్గతి
విశ్వదాభిరామ-----------."
మనసా వాచా పతిని దైవంగా భావించే సతికిమంచి గతులు లభిస్తే భర్తను నిందించే స్త్రీకి దుర్గతే ప్రాప్తమౌతుందట.ఎట్టి పరిస్థితుల్లోనూ భార్య భర్తను వదలకూడదని ఇతని భావన.
" పతిని విడువ రాదు పదివేలకైనను
బెట్టి చెప్ప రాదు పెద్ద కైన
పతిని తిట్ట రాదు సతి రూపవతియైన
విశ్వదాభిరామ-----------. "
ఎంతటి రూపవతి యైనా భర్తను విడువరాదు.అతనిని తిట్టరాదు.ఇతరులకు పెట్టిన దానిని గొప్పగా చెప్పుకొనరాదట.అంతేకాదు ఇంకా
" తగిన కులజుడైన తన యెత్తు ధనమైన పర పురుషుల నేల పట్ట వచ్చు
పరమ సాధ్వి జూడ నొరుల నంటదు సుమా
విశ్వదాభిరామ------------."
ఉత్తమ వంశంలో పుట్టినా నిలువెత్తు ధనమిచ్చినా ఉత్తము రాలైన స్త్రీ పరపురుషుల చెంత చేరదు.అట్టి వారిని తాకదు,తనను తాకనీదు.
"మాట మిగులు నాలు మగనికి యమదూత
యోర పడగ పాము కుద్ది యగును
తనకు గాని యాలు దానవు రాలురా
విశ్వదాభిరామ -------------."
భర్త మాట జవదాటే స్త్రీ యమదూతే.అంతేకాదు కాటువేయడానికి సిద్ధపడే పాము వంటిదట.తగిన సతి కాకపోతే ఆమె నిజంగా రాక్షసే నట.
మనసెరిగిన మగువనే దగ్గరగా చేర్చాలని ఇతని భావం.అలా ఐతేనే భక్తి,ముక్తి,భాగ్యం కల్గుతాయట.అలా కాని భార్య చెంతకు పోరాదంటాడు.కొంతమంది స్త్రీలు డబ్బుంటేనే భర్తను గౌరవిస్తారని అంటూ
"మగని కలిమి బలిమి మగువకును బలంబు
కలిమి లేని మగడు కాసు గాడు
పనికి రాని మగని పాటించి చూడరు
విశ్వదాభిరామ ------------."
ధనవంతుడు బలవంతుడు యైన భర్తే భార్యకు బలం.అవేవి లేకపోతే ఆమె దృష్టిలో భర్త కాసుకు కూడ కొరగాడు.అట్టి భర్తను ఏ స్త్రీ లెక్క చేయదట.
" కూలి నాలి చేసి గుల్లాము పనిచేసి
తెచ్చి పెట్ట జాలు మెచ్చు చుండి
లేమి జిక్కు విభుని వేమారు దిట్టును
విశ్వదాభిరామ---------."
ఏదో విధంగా కూలో నాలో చేసి డబ్బు సంపాదిస్తేనే భార్య మెచ్చు కొంటుందట.
భార్యాభర్తల కుటుంబ జీవనానికిచిచ్చు పెట్టే వేశ్యావృత్తిని వేమన తీవ్రంగానిరసించాడు.కట్టుకొన్న భార్యను వదిలి వేశ్యల చెంతకు వెళ్ళే వాడిని వెర్రి వాడిగా జమకట్టాడు.
"ఇంటి యాలి విడిచి ఇల జారకాంతల
వెంట దిరుగు వాడు వెర్రివాడు
పంట చేను విడిచి పరగ యేరిన యట్లు
విశ్వదాభిరామ-----------."
ఇంట్లో వున్న ఇల్లాలిని విడిచి వేశ్యల వద్ద కెళ్ళడం పంట చేనును విడిచి పరిగ నేరినట్లుంటుందని ఇల్లాలికి వెలయాలికి గల తేడాను సున్నితంగా వివరించాడు.
"సాధు చరిత యైన సతి సత్ప్రవర్తన
జార యేమెరుంగు?సాధు జనుని
బ్రహ్మ నిష్ట మొరకు ప్రాకృతుండెరుగునా
విశ్వదాభిరామ---------- "
నీచులకు పండితుల యొక్క గొప్పదనము ఎలా తెలియదో ప్రతివత యొక్క గొప్పదనం వేశ్యకు తెలియదట.ఇంకా వేశ్యలను
"ఊర పంది యెరుగదుత్తమ వస్తువుల్
చెడ్డ నరక మెల్ల చెందు గాని
సాధ్వి మహిమయెట్లు స్వైరిణి యెరుగురా
విశ్వదాభిరామ --------------".
ఊరపందులతో పోల్చాడు.వాటికి బురద తప్ప మంచి వస్తువు గిట్టదు.అలాగే సాధ్వి మహిమ పంది లాంటి జారవనితకు పతివ్రత గొప్పదనం ఎలా తెలుస్తుందని యీసడిస్తాడు ఇల్లాలికి వెలయాలికి గల తేడాను ఎత్తి చూపుతూ
"అదనెరిగిన మగువ అనువెర్గు చనవెర్గు
ముదము తోడి మగని మోహ మెరుగు
విభుని శ్రేష్ట గుణము వేశ్య తానెరుగునా
విశ్వదాభిరామ------------."
ఒకవేళ వారివల్ల సంతానం కల్గినా ఉపయోగంలేదంటాడు.
" ఔరసుండె నీకు వారసుండగుగాక
వేశ్య యందు పుట్టు వెధవ కొడుకు
నీవు పోయినపుడు నీళ్ళైన వదులునా
విశ్వదాభి రామ ------------ ."
భర్త యొక్క శ్రేష్టమైన గుణాలు వెలయాలికి తెలియవంటాడు.ఒకవేళ వేశ్యవల్ల కొడుకు పుట్టినా నిరుపయోగమే నంటాడు.కనీసం తర్పణం కూడా విడువలేడని హేళన చేస్తాడు.
కన్యాశుల్కాన్ని,వరశుల్కాన్ని నిరసించాడు వేమన..
౹ఆడ పిల్లలను డబ్బు(ఓలి)కోసం అమ్ముకోరాదంటాడు .అంతేకాదు ధనవంతులకిచ్చి పెళ్ళి చేయడం కంటే పేదలకిచ్చి చేయడం మంచిదంటాడు.పేదవాడికి పిల్ల నిస్తానని చెప్పి
బంగారాన్ని అడగరాదంటాడు.ఏంచేయాలో చెపుతున్నాడు
"కడివె డన్నము పెట్టి కన్య నీవలెగాని
పడుపు కూడు కుడవ వలదు వేేమా"
అంటాడుఅన్నం పెట్టి పిల్ల నివ్వాలికాని డబ్బుతీసుకొని చేస్తే పడుపు కూడు తిన్నట్లే నని నిరసిస్తాడు.ఎటువంటి వారికి పిల్ల నిస్తే బాగుంటుందో సూచిస్తున్నాడు.
" కలిమి జూచి ఈయ కాయమిచ్చిన యట్లు
సమున కీయ నదియు సరస తరము
పేద కిచ్చు మనువు పెన వేసి నట్లుండు
విశ్వదాభిరామ------------."
ఇక ఉమ్మడి కుటుంబాలు ఆడవాళ్ళ వల్ల ఎలా ఛిద్ర మౌతున్నాయో,భార్య మాటలు విని మగడు తనవారి నెలా చిన్నబుచ్చుతాడో తెలిపాడు.భార్య మాట విని వేరు పోయే వాడు
"ఆలి మాటలు విని అన్న దమ్ముల బాసి
వేరు పడెడి వాడు వెర్రి వాడు
కుక్కతోక బట్టి గోదావరీదునా
విశ్వ దాభిరామ------------. "
వెర్రివాడేనని తీర్మానించాడు.ఇంకా అటువంటివాడు మూర్ఖుడంటూ
"తల్లి యేడ్వ వినక తన యాలు వగచిన
జాలి పడెడి వాడు జడుడు సుమ్మి
తారతమ్య మెరుగ నేరని పశువేను
విశ్వదాభి రామ-----------."
కనిపెంచిన తల్లికి కష్టం కల్గి కంట తడి పెడితే కరుణ చూపని కొడుకు తన భార్య అలిగి ఏడిస్తే జాలి పడతాడట.ఇట్టి వాళ్ళను వేమమ పశువుతో పోలుస్తున్నాడు.
పౌరాణిక వ్యక్తులను,పురాణాలను గురించి చర్చిస్తూ వేమన కొంత మంది స్త్రీల వల్ల నష్టాలు జరిగాయని,కొంతమంది వల్ల మంచి జరిగిందని చెపుతున్నాడు.
"కైక పుట్టి చెరిచెగా రామ పట్టంబు
సీత బుట్టి లంక చెరిచె గాదె
కౌరవులను చెరిచెగా ద్రౌపదియు బుట్టి
విశ్వదాభిరామ--------------".
కైకవల్ల రామ పట్టాభిషేకం ఆగింది.లంకా పట్టణ న నాశనానికి సీత కారకు రాలయింది.ద్రౌపది మయసభలో రారాజును చూసి హేళనగా నవ్వడం వల్ల సుయోధనునిలో పగ రగిలింది.ఆపగే మాయా జూదానికి,ద్రౌపది అవమానానికి దారి తీసింది.
ఆత్మ రక్షణ చేసుకోలేని ద్రౌపది "హా కృష్ణా"అంటూ కృష్ణునికి మొర పెట్టుకొంటుంది.ఫలితం కురు పాండవ యుద్ధం,కౌరవ వంశ నాశనం జరిగింది.
వేమన దృష్టిలో' 'దమయంతి 'ఆదర్శ వంతమైన స్త్రీ.ఈమె ధైర్య వంతురాలు.జూదంలో ఓడిపోయిన భర్తల వెంట అడవుల కెళ్ళింది.భర్త తనను ఒంటరిగా కారడవిలో వదిలి పోగా ఓ కిరాతకుడు చెరపడతాడు.కానీ దమయంతి ఆత్మ స్థైర్యంతో వాని మదమణచి చంపి ఆత్మ రక్షణ చేసుకొంటుంది.భర్తను తిరిగి తన వద్దకు ఉపాయంతో రప్పించు కోవడమే కాక మళ్ళీ రాజ్యాధికారం వచ్చేట్లు చేసింది.ఈ విషయాన్ని వివరిస్తూ
"కష్టముల కోర్చి దమయంతి కాడు సొచ్చె
దుష్ట కైరాతకుని బట్టి ధూళి చేసె
వ్యష్టియై సత్య వైభవ మందె గాదె
నిష్ట మదిగల పతిభక్తి నియతి వేమ! "
అంటూ దమయంతి పతిభక్తిని ప్రశంసిస్తాడు.ఆమె అతి క్లిష్ట పరిస్థితులలో ఆత్మరక్షణ, ప్రాణరక్షణ, మానరక్షణ చేసుకొన్న ధీరురాలు.
తన చాకచక్యంతో సత్య నిష్టతో "నలుని"మరల రాజుగా సింహాసనం పై అధిష్టింప జేసింది.
స్రీల వల్ల మానవులే కాదు దేవతలు కూడ తిప్పలు పడక తప్ప లేదంటాడు వేమన.చనువిస్తే దేవతలు సైతం నెత్తి కెక్కుతారనే విషయాన్ని వ్యంగ్యంగా వివరించాడు.
"పడతి మోసె నొకడు పడతి మేసె నొకండు"
పడతి నురము చేర్చి బ్లతికె నొకడు
పడతి కొరకె పెక్కు పాట్లను బడిరయా
విశ్వదాభి రామ--------------="
సృష్టికర్తయైన బ్రహ్మ 'సరస్వతిని ' వాక్ స్థానంలో అనగా నోట్లో నిలిపాడు.శ్రీమహా విష్ణువు లక్ష్మిని గుండె మీది కెక్కించు కొన్నాడు.వీరిద్దరి కంటే ఘనుడు శివుడు మరో రెండాకులు ఎక్కువే చదివాడు.పార్వతికి సగం దేహమిచ్చింది చాలక మరో భార్య గంగను ఏకంగా నెత్తిపై కెక్కించు కొన్నాడు.త్రిమూర్తులంతటి వారే స్త్రీల కోసం ఇన్ని అగచాట్లు పడితే మామూలు మానవుల సంగతి చెప్పనక్కర లేదుకదా అంటాడు.
వేమన స్రీలలో దమయంతిని మెచ్చుకొన్నట్లుగా పురుషులలో హరిశ్చంద్రుని మెచ్చుకొన్నాడు.
"ఆలినమ్మ భువిని నాచార హీనుడై
ప్రాలు మా లె నొక్క ప్రతిన కొరకు
ఆడి తప్ప కుండ కాడు కాచిన వాడు
వాడె పరమ గురుడు వసుధ వేమ!"
సత్యవాక్య పరిపాలన కోసం హరిశ్చంద్రుడు భార్య నమ్ముకొని ఆచార శూన్యుడై చివరకు కాటికాపరిగా మారాడు.భార్య నమ్ముకొన్నా కూడా పరమ గురువే నని అతనిని వేమన మెచ్చుకొన్నాడు.
మానవుల మనస్తత్త్వాన్ని భార్య పైన వారి బంధువుల పైన గల మమకారాన్ని వేమన విమర్శనా దృష్టితో వివరిస్తున్నాడు.
" ఆలి వంక వారు ఆత్మ బంధువులైరి
తల్లి వంక వారు తగు పాటి వారు
తండ్రి వంక వారు దాయాది పగవారు
విశ్వదాభి రామ --------------. "
భార్య వైపు వారు కట్నాలు కానుకలు ఇస్తారు కాబట్టి వారే ఆప్తులు,ఆత్మ బంధువులు.తల్లి వైపు వారు ఫరవాలేదు.కాని తండ్రి వైపు వారు దాయాదులు పగవారట.ఈ విషయాన్ని విష్ణుమూర్తికి కూడా అంట గట్టాడు మన వేమనకవి.
"బంధు కోటి బాసి బయలును దెలియక
సింధు పుత్రి మాయ జిక్కి గాదె
శ్రాంగి యంత వాడె జనులకు శక్యమా
విశ్వదాభి రామ------------ "
తన వాళ్ళందరిని వదిలి పెట్టి భార్యపై వ్యామోహంతో ఆ లక్ష్మీ దేవి మాయలో పడి సాక్షాత్తు విష్ణు మూర్తే అత్తగారిల్లు(పాలసాగరం) చేరుకొన్నాడంటే ఇక మామూలు జనులొక లెక్కా అని వ్యంగ్యంగా ప్రశ్నిస్తాడు.
ఈ విధంగా వేమన తవ పద్యాల్లో మహిళల పట్ల తన భావాలను వ్యక్తం చేశాడు.ఇందులో ముఖ్యంగా వ్యభిచారాన్ని,వ్యభిచారులను తీవ్రంగా నిరసించాడు.ముఖ్యంగా జారస్త్రీల అంగాంగాలను హేయంగా వర్ణించాడు.వెలయాళ్ళను అసభ్య పదాలతో సంబోధించాడు.కన్యాశుల్కాన్ని నిరసించాడు.వివాహ విషయాలలో కలిమి లేములకు కాక ఈడూ జోడుకు ప్రధాన్యత నివ్వాలన్నాడు.దుర్మార్గాలను స్త్రీలు ఎదిరించాలని సూచించాడు.పరస్త్రీలను తల్లిలా భావించాలని బోధించిన వేమన నిజంగా స్త్రీలపై అభిమానం కలవాడే.
చివర్లో ఫలశ్రుతిగా చెప్పిన పద్యం వేమనకు భగవంతునిపై గల విశ్వాసాన్ని తెలియ చేస్తుంది.
"వేమన పద్యము లెల్లను
సామముతో చదివినట్టి సజ్జను లెల్లన్
సోముని తల గల యాతని
సామీప్యము పొంద గలరు సత్యము వేమా!
వేమన పద్యాలన్నింటిని శాంతంగా చదివిన వారికి శివ సాయుజ్యం లభిస్తుందనే ఫలశ్రుతి చెప్పబడింది.
***********
పాతం : వేమన యౌవన దశలో కవిగా 'కామిగా మోక్షకి మిగాడు' అన్నాడు. కానీ, అనుభవపూర్వకంగా జీవితాన్ని చదివాక తన తప్పిదాలను తానెరిగి, తన్ను తాను తెలుసుకొని యోగిగా ఎదిగి ఆలోచనాత్మకమైన సందేశాలెన్నింటినో ఇచ్చాడు. స్త్రీల యెడల కూడా గొప్ప సత్యాలను ఎంతో సూటిగా చెప్పాడు. స్త్రీ తప్పిదాలకు పురుషుడే కారణం అనే భావంతో... 'తరుణి పుణ్యవతిగ వరుని బట్టియె యగు/ పాపియగును, మగని బట్టియె, యిల / భర్తవర్తనంబె పడతికి గ్రాహ్యంబు' అంటాడు. భార్యబిడ్డలు మంచిగా ఉన్న సంసారం భర్తకు స్వర్గం కంటే మిన్నగా ఉంటుంది అంటూ- సుగుణ వంతురాలు సుదతియై యుండిన బుద్ధిమంతులగుచు పుత్రులొప్ప/ స్వర్గమేటికయ్య సంసారికింకను' అంటారు. తల్లి ప్రేమకు మించిన ప్రేమ ఉండదు అంటూ 'కావు కావు మనుచు కరుణయై యేడ్చెడు / శిశివు చేరదీసి చిత్తమలర/ పాలనిచ్చునట్టి పడతి పుణ్యాత్మరా' అని పేర్కొంటాడు. ఇంట్లో భార్యకు అన్యాయం చేసి జారకాంతల వెంట తిరుగు పురుషుణ్ణి వెర్రివానిగా పేర్కొంటాడు. 'ఇంటియాలి విడిచి ఇలజార కాంతల / వెంట తిరుగుతాడు వెర్రివాడు/ పంట చేను విడచి పరిగె యేరినయట్లు' అంటారు. తల్లిదండ్రిని వృద్ధాశ్రయం పాల్జేసే ఇప్పటి బిడ్డలకు కూడా వర్తించే విధంగా 'తల్లి దండ్రిమీద దయలేని పుత్రుడు/ పుట్టనేమి వాడు గిట్టనేమి పుట్టలోనె చెదలు పుట్టవా; గిట్టవా?' అంటాడు.
మరి కొన్ని పద్యాలు
గుణవతి యగు యువతి గృహము చక్కగనుండు
చీకటింట దివ్వె చెలఁగురీతి
దేవియున్న యిల్లు దేవార్చన గృహంబు
విశ్వదాభిరామ వినర వేమ.
చీకటింట దివ్వె చెలఁగురీతి
దేవియున్న యిల్లు దేవార్చన గృహంబు
విశ్వదాభిరామ వినర వేమ.
ఇంటియాలు విడిచి యిల జారకాంతల
వెంటఁ దిరుగువాఁడు వెఱ్ఱివాఁడు
పంటచేను విడిచి పరిగ యేరినయట్లు
విశ్వదాభిరామ వినర వేమ.
వెంటఁ దిరుగువాఁడు వెఱ్ఱివాఁడు
పంటచేను విడిచి పరిగ యేరినయట్లు
విశ్వదాభిరామ వినర వేమ.
మగనికాలమందు మగువ కష్టించిన
సుతుల కాలమందు సుఖముఁ బొందు
కలిమి లేములెందుఁ గలవెంతవారికి
బలిమి పుత్రబలిమె బలిమి వేమ.
సుతుల కాలమందు సుఖముఁ బొందు
కలిమి లేములెందుఁ గలవెంతవారికి
బలిమి పుత్రబలిమె బలిమి వేమ.
అమ్మసుమీ యా లనఁగా
నమ్మనఁగా నాలు సుమ్మియాయిద్దరిని\న్
ఇమ్మహిలోఁ బరమాత్ముని
నెమ్మదిలోఁ దెలియఁ దానె నేర్పరి వేమా.
నమ్మనఁగా నాలు సుమ్మియాయిద్దరిని\న్
ఇమ్మహిలోఁ బరమాత్ముని
నెమ్మదిలోఁ దెలియఁ దానె నేర్పరి వేమా.
మగఁడు మదనుఁడైన మంచికాఁపురమైన
సహజ మేల మాను జారకాంత
పాలుద్రావు కుక్క బడిబడి పోవదా
విశ్వదాభిరామ వినర వేమ.
సహజ మేల మాను జారకాంత
పాలుద్రావు కుక్క బడిబడి పోవదా
విశ్వదాభిరామ వినర వేమ.
జాణలనయట్టి చపలాయతాక్షుల
వలపు లరసిచూచి బ్రమయకేల
బయలిరూపులరసి పరికింపగా నేల
విశ్వదాభిరామ వినర వేమ.
వలపు లరసిచూచి బ్రమయకేల
బయలిరూపులరసి పరికింపగా నేల
విశ్వదాభిరామ వినర వేమ.
ఇంతిఁ జూచెనేని యింతంత యనరాదు
కానవహ్నిలక్క కరఁగినట్లు
వట్టిమోహ మిట్లు రట్టులఁ జేసెరా
విశ్వదాభిరామ వినర వేమ.
కానవహ్నిలక్క కరఁగినట్లు
వట్టిమోహ మిట్లు రట్టులఁ జేసెరా
విశ్వదాభిరామ వినర వేమ.
ఇంతిఁ జూచెనేని యింతంత యనరాదు
కానవహ్నిలక్క కరఁగినట్లు
వట్టిమోహ మిట్లు రట్టులఁ జేసెరా
విశ్వదాభిరామ వినర వేమ.
కానవహ్నిలక్క కరఁగినట్లు
వట్టిమోహ మిట్లు రట్టులఁ జేసెరా
విశ్వదాభిరామ వినర వేమ.
పనసతొనలకన్నఁ బంచదారలకన్న
జుంటితేనెకన్న జున్నుకన్నఁ
జెఱకురసముకన్నఁ జెలిమాట తీపురా
విశ్వదాభిరామ వినర వేమ.
జుంటితేనెకన్న జున్నుకన్నఁ
జెఱకురసముకన్నఁ జెలిమాట తీపురా
విశ్వదాభిరామ వినర వేమ.
ఆలివంకవార లాత్మబంధువు లైరి
తల్లివంకవారు తగినపాటి
తండ్రివంకవారు దాయాది తగవులౌ
విశ్వదాభిరామ వినర వేమ.
తల్లివంకవారు తగినపాటి
తండ్రివంకవారు దాయాది తగవులౌ
విశ్వదాభిరామ వినర వేమ.
కనకమేడల మంచి కాంతలయెడలను
వలఁచియుందు రెంతవారలైన
తోయజాక్షిఁ బాయుదొర లెవ్వరును లేరు
విశ్వదాభిరామ వినర వేమ.
వలఁచియుందు రెంతవారలైన
తోయజాక్షిఁ బాయుదొర లెవ్వరును లేరు
విశ్వదాభిరామ వినర వేమ.
వెలయాలి వలనఁ గూరిమి
కలుగదు, మఱి కలిగెనేని కడతేరదురా
పలువురు నడిచెడి తెరువున
పులు మొలవదు, మొలిచెనేని పొదలదు వేమా.
కలుగదు, మఱి కలిగెనేని కడతేరదురా
పలువురు నడిచెడి తెరువున
పులు మొలవదు, మొలిచెనేని పొదలదు వేమా.
తగినకులజుఁడైన తలయెత్తు ధనమైన
భాగ్యపురుషునేల పట్టనెంచు
పరమసాధ్వి చూడ పరులనంటదు సుమీ
విశ్వదాభిరామ వినర వేమ.
భాగ్యపురుషునేల పట్టనెంచు
పరమసాధ్వి చూడ పరులనంటదు సుమీ
విశ్వదాభిరామ వినర వేమ.
ఆలు మగనిమాట కడ్డంబు వచ్చెనా
యాలుఁగా దది మరగాలు కాని
యట్టియాలు విడచి యడవి నుండుట మేలు
విశ్వదాభిరామ వినర వేమ
యాలుఁగా దది మరగాలు కాని
యట్టియాలు విడచి యడవి నుండుట మేలు
విశ్వదాభిరామ వినర వేమ
మాటవిననియాలు మగనికి మృత్యువు
యోటిపడవ సర్ప మొంటిగృహము
తనకుఁగానియాలు దానవురాలయా
విశ్వదాభిరామ వినర వేమ.
యోటిపడవ సర్ప మొంటిగృహము
తనకుఁగానియాలు దానవురాలయా
విశ్వదాభిరామ వినర వేమ.
ఆలిమాటలు విని యన్నదమ్ముల రోసి
వేఱుపడెడువాఁడు వెఱ్ఱివాఁడు
కుక్కతోఁకఁ బట్టి గోదావ రీఁదునా
విశ్వదాభిరామ వినర వేమ.
వేఱుపడెడువాఁడు వెఱ్ఱివాఁడు
కుక్కతోఁకఁ బట్టి గోదావ రీఁదునా
విశ్వదాభిరామ వినర వేమ.
స్త్రీలు కల్గుచోట చెల్లాటములుకల్గు
స్త్రీలులేని చోటఁ జిన్నఁబోవు
స్త్రీలచేత నరులు చిక్కుచున్నారయా
విశ్వదాభిరామ వినర వేమ.
స్త్రీలులేని చోటఁ జిన్నఁబోవు
స్త్రీలచేత నరులు చిక్కుచున్నారయా
విశ్వదాభిరామ వినర వేమ.
ఎట్టిస్త్రీలఁ గనిన నింతంత యనరాదు
కాలవహ్ని లక్క కరఁగినట్లు
ఇట్టిగాఢమోహ మెంతైనఁ జేయురా
విశ్వదాభిరామ వినర వేమ.
కాలవహ్ని లక్క కరఁగినట్లు
ఇట్టిగాఢమోహ మెంతైనఁ జేయురా
విశ్వదాభిరామ వినర వేమ.
వారకాంత లెల్ల వలచి యేతెంతురా
పొందుఁజేసి ధనము పుచ్చుకొఱకు
మాచలమ్మ వచ్చి మఱి యిల్లువెళ్లురా
విశ్వదాభిరామ వినర వేమ.
పొందుఁజేసి ధనము పుచ్చుకొఱకు
మాచలమ్మ వచ్చి మఱి యిల్లువెళ్లురా
విశ్వదాభిరామ వినర వేమ.
ఆలు పతిసౌఖ్యముల కిల
నాలయ మగునేని దానినా లన వచ్చు\న్
ఆలాగునఁ గాకుండిన
కాలునిపెనుదూత యదియ కదరా వేమా.
నాలయ మగునేని దానినా లన వచ్చు\న్
ఆలాగునఁ గాకుండిన
కాలునిపెనుదూత యదియ కదరా వేమా.
నెత్తిన రుద్రునకును
స్త్రీ నోటను బ్రహ్మకెపుడు సిరి గుల్కంగా
స్త్రీ నెదిరి ఱొమ్మున హరికి
స్త్రీ నెడపఁగ గురుఁడ నీవు దేవర వేమా.
స్త్రీ నోటను బ్రహ్మకెపుడు సిరి గుల్కంగా
స్త్రీ నెదిరి ఱొమ్మున హరికి
స్త్రీ నెడపఁగ గురుఁడ నీవు దేవర వేమా.
ఆఁడు దానిబొంకు గోడపెట్టినయట్టు
పురుషవరుని బొంకు పూలతడిక
స్త్రీలనేర్పులు భువి చీకు రాయితపము
విశ్వదాభిరామ వినర వేమ.
పురుషవరుని బొంకు పూలతడిక
స్త్రీలనేర్పులు భువి చీకు రాయితపము
విశ్వదాభిరామ వినర వేమ.
.పతియొప్పిన సతి యొప్పును
సతిపతు లొకటైనఁ బరమపావన మందూ
స్సతిపతిన్యాయమె మోక్షం
బతులితపరమాత్మ నైక్య మగురా వేమ
సతిపతు లొకటైనఁ బరమపావన మందూ
స్సతిపతిన్యాయమె మోక్షం
బతులితపరమాత్మ నైక్య మగురా వేమ
ఆ.వె:వనిత లిరువు రిచట వైనముగా బండి
నడుపుటనుగనంగ నయనములకు
పండువగును గాదె;పట్టుదలను బూన
సాధ్య మవని దేది సదయులార.
నడుపుటనుగనంగ నయనములకు
పండువగును గాదె;పట్టుదలను బూన
సాధ్య మవని దేది సదయులార.
2.ఆ.వె:రయమున హయమెక్కె రాణి రుద్రమ దేవి
రాజ్యమేలె గాదె రమణ తోడ
ముదితల కిలలోన ముదమార నేర్పంగ
నన్ని నేర్తు రవని యందు నిజము
3.ఆ.వె:అవసరమ్ము నేర్పు నతివలకెల్లను
కష్టసాధ్యమైన కార్యములను
నేర్పుతోడ చేయు నేర్పరి తనమబ్బు
అభినుతించ వలయు నార్యులార.
4ఆ.వె:.ఝాన్సి రాణి లక్ష్మి జయమందె హయమెక్కి
పోరు సల్పితాను పూజ్యత గనె
వంట పనియెగాదు వడిగ నే పనినైన
చేయగలరతివలు చిటికె లోన.
ఆ.వె:అడువారటంచు నలుసుగా చూడకు
నవని నేలగలరు నలఘు మతులు
వంట వండగలరు వాహనాలవలీల
నడపగలరు గాంచు డవని యందు.
నవని నేలగలరు నలఘు మతులు
వంట వండగలరు వాహనాలవలీల
నడపగలరు గాంచు డవని యందు.
2.ఆ.వె:ఆడువారనంగ నబలలే గారిల
నాదిశక్తులంచు నరయుడయ్య
ఎట్టి పనుల నైన నిట్టె చేయగలరు
వాహనమ్ము నడుపు పడతిఁగనుము.
3.కం:జల్లెడ దిప్పిన చేతులు
మెల్లగ స్టీరింగు బట్టి మెలకువ తోడన్
తల్లడి చెందక బండిని
నుల్లము నందున బెదరక నువిదయె నడుపున్.
4.ఆ.వె:అవనినేలగలదు హయము నెక్కగలదు
విద్య లెల్ల నేర్చి వెలుగ గలదు
వాహనంబు నడిపి వాసికెక్కగలదు
అబల కాదు చూడు సబల యీమె.
.వె:బస్తి నేలగలదు బండి నడుప గలదు
నవసరమ్మె నేర్పు నతివకన్ని
చక్రములశకటము చక్కగా త్రిప్పుచు
తాను సాగు చుండు ధరణి యందు.
ఆ.వె:కష్టసాధ్యమైన కార్యంబు లెల్లను
సులువు గానె చేసి చూపగలదు
ఆడదబల గాదు సబలన్నతీరుగ
సాగు చుండు గనుము జగతి యందు.
ఆ.వె:పొట్టకూటి కొరకు పుడమిపై పడుచున్న
పడతి పాట్లు చూడ బాధ కలుగు
తప్పు లెన్ని యున్న తప్పదు సాపాటు
ననుచు తొక్కె రిక్ష యవని యందు.
ఆ.వె:ఆడదంటె కాదు అంగడిలో బొమ్మ
ఆడదంటె అమ్మె యవని యందు
అమ్మ నాదరించ నఖిలసిరులబ్బు
ననెడి మాట నెపుడు నమ్మ వయ్య.
ఆ.వె:మగువ మన్ననంద మహియంత వెలుగును
లలనలున్న చోట లక్ష్మి తాను
వాసముండు నండ్రు వసుధలో జనములు
గౌరవించుడయ్య ఘనముగాను.
ఆ.వె:మగువలె మహిలోన మణిదీపములని
తెలియుమయ్య నీవు తెలివి తోడ
అన్నమిడెడి వేళ నన్నపూర్ణ యౌను
నాగ్రహమ్ము కలుగ నపర కాళి
ఇక చివరగా "మనువు"చెప్పిన "షట్కర్మయుక్తా కులధర్మపత్నీ"గురించి చిరు కవితతో(నాలుగింటిని మాత్రమే ప్రస్తావించాను) మహిళలకు మేలుకొలుపు.
ఇక్కడ కేవలం భార్య అనే అర్థంలో మాత్రమే కాకుండా ఉద్యోగినియైన మహిళను దృష్టిలో నుంచుకోవాలని మనవి.
"ఓ మహిళా తెలుసుకో తెలివిగా మసలుకో
సమాజంలో సగభాగం నీవు
సంసారంలో సగభాగం నీవు
నీవు లేని జగతి లేదు నీవు లేక ప్రగతి లేదు
అమృతం పంచే ఆమృతవర్షిణివి నీవే
అసభ్య వర్తనుల పాలిటి అపర కాళికవు నీవే
"కార్యేషు దాసి"లా సేవలందించు
దాసివని జులుం చేస్తే నిలదీసి ప్రశ్నించు
"కరణేషు మంత్రి"లా సలహాల నందించు
కార్యభారం మోపితే సున్నితంగా తిరస్కరించు
"భోజ్యేషు మాత"గా అతిథుల నాదరించు
కడుపార తినిపించు 'అన్నపూర్ణ'వనిపించు
"క్షమయా ధరిత్రి"వంటూ మునగ చెట్టెక్కిస్తే
చరగని చిరునగవుతో ఇబ్బందుల నధిగమించు
సహనానికి హద్దుంటుందని ప్రవచించు
మరి_____ఆసహనం హద్దు మీరితే
ప్రళయం సృష్టిస్తుందని హెచ్చరించు
నవమాసాలుమోసి బిడ్డను కనే శక్తి నీదే
ఆబిడ్డ అడ్డ దారిన పడితే శిక్షించే అధికారమూ నీదే
వేద కాలం నుండీ నేటి కాలం దాకా
మన్నన లందిన మగువల తెగువ గుర్తుంచుకో
కదన రంగంలోనేకాదు కవన రంగంలోనూ
కదం తొక్కి కవిత లల్లిన మగువలే స్ఫూర్తి నీకు
ఓ మహిళా తెలుసుకో తెలివిగా మసలుకో.
No comments:
Post a Comment