Saturday, October 21, 2017

దీపావళీ & లక్ష్మీ స్తుతి.

అంశం:నరక చతుర్దశి

లోక కంటకుడైన నరకాసురుని లోకపూజ్యుడైన శ్రీకృష్ణుడు సత్యభామా సమేతుడై వెళ్ళి విజయలక్ష్మితో తిరిగొచ్చాడుఇదియే "నరకచతుర్దశి" "దీపావళి" పండుగలుగా టపాకాయలు కాల్చి సంబరంగా చేసుకొంటున్నాము.

ఈసందర్భంగా  వ్రాసిన పద్యములు.

ఆ.వె:దైత్యు డొకడు నాడు దాచె ధరను నీట

      వాని జంపి హరియు వసుధ నెత్తె

     దాన సతియునయ్యె ధరణియు ముదమున

    పుట్టె నరకుడపుడె పుడమి యందు.

   

ఆ.వె:ధరణి కోరె పతిని తనయునొసగు మంచు

    నసుర సంధ్య వేళ యందు తాను

     నట్టి కోర్కె కూడ దనుచుహరియు పల్క

     పట్టు బట్టి పుత్రు బడసె నవని.


తే.గీ:అసుర బుద్ధిచే నెల్లర కనవరతము

      హింస లిడుచు నుండె నరకు డిలను సతము

    తల్లి చేతులందె తనకు మరణ ముండు

   నట్లు  పొందె వరము తాను నజుని వలన.


       ఆ.వె: వరముపేర్మి చేత వసుమతీ తనయుండు
       మగువలను మునులను మట్టుబెట్ట
       నెంచి వారి నెల్ల నిర్బంధమొనరింప
       వాసుదేవు డణచె వాని మదము.


ఆ.వె:అరి నొకపరి జూచు హరినొక పరిజూచు
       వాడి చూపు లనొక వంక వలపు
       జూపుల ప్రియ సఖుని జూచుచు మ్రోగించె
       సమర భేరి నపుడె సత్యభామ.


అ.వే:శౌరి తోడ నతివ సయ్యాట లాడుచు
       సంహరించె నరకుఁసత్యభామ
      నాటి నుండి నిదియే నరకచతుర్దశి
      పండుగయ్యె గాదె వసుధ యందు.



అంశం:దీపావళి.

ఆ.వె: అమవశి నిశి లోన అర్ధరాతిరి యందు
       అవని జనుల కెల్ల హర్ష మొదవె
       కాంతి పుంజమటుల కాంతులు వ్యాపించె
       పట్టపగలు వోలె ప్రభలు నిండె.


ఆ.వె:లక్ష్మి పూజ సేయ లలనా మణులు చేరి
          భక్తి పూర్వకముగ భజన చేసి
          కొలువ నపుడె యమ్మ కోరికల్ దీర్చుచు
        దీక్ష జూసి మురిసి దీవ నొసగు.


ఆ.వె:వణిజులుమరి వైశ్యులకెల్లను
        పెద్ద పండు గిదియె విశ్వమందు
        జమయు ఖర్చు లెంచి జయలక్ష్మిని గొలువ
        జయము నొసగు నంబ జంకు వలదు.


బలిపాడ్యమి.

శ్రీమహా విష్ణువు వామనుడిగా బలిచక్రవర్తివద్దకొచ్చి మూడడుగుల నేల వేడి త్రివిక్రముడై ముల్లోకాలను ఆక్రమించిన రోజు.
బలి పాడ్యమి సందర్భంగా  మూడు పద్యాలు.

కం:బలి యాగడముల నోపగ
     జాలము తండ్రీ,మురారి,జలజాక్షా,నీ
      జాలము తోడను వానిని
      బలహీనుని జేయుమంచు ప్రార్థించి రటన్.     1

ఆ.వె:సురల పల్కులెల్ల సుందరంబుగవిని
        వత్తు నేను మీకు వలదు భయము
         యనుచు దేవతలకు నభయంబు నొసగుచు
         వటువు గానె విష్ణు వటకు వచ్చె                   .

ఆ.వె:పొట్టి రూపు తోడ పుడమిని వేడంగ
       సర్వ మొసగె రాజు శంక లేక.
      బలిని యణచి యతని భార్యకు వరమిచ్చి
     కరుణ తోడ కాపు కాచి నావు.

ఈ రోజు కార్తీక శుద్ధవిదియ."యమ ద్వితియ"

అనికూడా అంటారు.అంటే యమధర్మరాజు తన సోదరి యైన యమున చేతు వంట తిని కానుకలొసగిన రోజు .'భగినీ హస్త భోజనం' గాప్రసిద్ధి చెందింది. ఇది దీపావళీ పండుగలో  భాగమయింది.

ఆ.వె:  యమున చేతివంట యద్భుతంబు యనుచు

          భగిని చేసినట్టి భక్ష్యములను

           ఆదరంబున దినె  యముడు నాడు నిదియె

                పండుగయ్యె గాదె వసుధ యందు.

No comments:

Post a Comment